22నిమిషాల్లో ఘాతుకం:7 నిమిషాల్లో సౌదీ జర్నలిస్టు హత్య: ముక్కలు చేశారు, భాగాల గుర్తింపు
ఇస్తాంబుల్: సౌదీ అరేబియాకు చెందిన జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్యకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయనను హత్య చేసిన వెంటనే నిమిషాల వ్యవధిలో మృతదేహాన్ని ముక్కలు చేసి తరలించేసినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక తన కథనం వెలువరించింది.
ఇస్తాంబుల్ కార్యాలయంలోకి వెళ్లి..
అక్టోబర్ 2వ తేదీన జమాల్ ఖషోగ్గి ఇస్తాంబుల్లోని సౌదీ అరేబియా దౌత్యకార్యాలయానికి వెళ్లారు. ఆయన కార్యాలయంలో అడుగుపెట్టిన రెండో నిమిషమే అతనిపై దాడి జరిగింది. ఆ తర్వాత ఖషోగ్గి సౌదీకి తిరిగి వచ్చేలా ఒప్పంచే క్రమంలో గొంతు నులిమారు. దీంతో ఖషోగ్గి ప్రాణాలు వదిలారు.
7నిమిషాల్లో హత్య.. ముక్కలు చేశారు..
తొలి ఏడు నిమిషాల వ్యవధిలోనే ఇదంతా జరిగిపోయింది. అనంతరం మరో 22 నిమిషాల్లో హంతకుల బృందం ఆయన మృతదేహాన్ని ముక్కలు చేసి తరలించేసిందని ఆ పత్రిక పేర్కొంది. అనంతరం ముస్తఫా అల్ మదానీ అనే హంతకుడు ఖషోగ్గి దుస్తులనే ధరించి వెనక ద్వారం నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఖషోగ్గి తమ వద్ద నుంచి వెళ్లిపోయాడని నమ్మించేందుకు ఇలా చేశారని టర్కీ దర్యాప్తు బృందం తెలిపింది. ఈ మేరకు హంతకుడి చిత్రాన్ని విడుదల చేసింది.
టర్కీ ఆగ్రహం
హత్య జరిగిన కార్యాలయానికి కొద్ద దూరంలో సౌదీ దౌత్యఅధికారి ఇంటి గార్డెన్లో ఖషోగ్గికి చెందిన వస్తువులు దొరికినట్లు స్కై న్యూస్ పేర్కొంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోపక్క ఈ హత్యపై టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ మండిపడుతున్నారు. ఇంత దారుణానికి తెగబడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఖసోగ్గి శరీర భాగాల గుర్తింపు
ప్రముఖ పాత్రికేయుడు, వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జమాల్ ఖషోగ్గి మృతదేహాన్ని ఎట్టకేలకు కనుగొన్నారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్లోని సౌదీ అరేబియా కాన్సుల్ జనరల్ నివాసంలో ఆయన శరీర భాగాలను గుర్తించినట్టు స్థానిక వార్తా సంస్థ ‘స్కై న్యూస్' వెల్లడించింది. ముక్కలుగా చేసిన జమాల్ ఖషోగ్గి మృతదేహాన్ని సౌదీ కాన్సుల్ జనరల్ ఇంటి ఆవరణలోని తోటలో పూడ్చిపెట్టినట్టు తెలిపింది.