నైజీరియాలో రెచ్చిన ఉగ్రవాదులు: బాగా పట్నం దగ్ధం
బాగా (నైజీరియా): నైజీరియాలోని ఇస్లామిక్ బోకో హరామ్ ఉగ్రవాదులు బుధవారం రెచ్చిపోయారు. నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని బాగా పట్టణాన్ని తగలబెట్టేశారు. ఈ దాడుల్లో దాదాపు 2000 మంది మరణించారని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ బీబీసీ వార్తా సంస్థ వెల్లడించింది. బాగా వీధుల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని తెలిపింది. ఇటీవలి కాలంలో బోకో హరామ్ ఉగ్రవాదుల రెండో దాడి ఇది. ఇస్లామిక్ రాజ్య స్థాపనే ధ్యేయంగా 2009లో బోకో హరామ్ ఉగ్రవాద పోరాటాన్ని ప్రారంభించారు.
నిరుడు నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని అనేక గ్రామాలు, పట్టణాలను బోకో హరామ్ హస్తగతం చేసుకుంది. అప్పుడు జరిగిన పోరాటంలో దాదాపు 15 లక్షల మంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. గత ఏడాది మొత్తంమీద 2000 మందిని పొట్టన పెట్టుకున్నారు. బాగా పట్టణంలో దాదాపు పది వేల మంది జనాభా ఉన్నారని, ఇప్పుడు మొత్తంగా ఆ పట్టణమే కనిపించకుండా పోయిందని అక్కడి నుంచి వలస వెళ్లిపోతున్న ప్రజలు తనకు చెప్పినట్లు సీనియర్ ప్రభుత్వ అధికారి మూసా అల్హాజి బుకర్ తెలిపారు. పట్టణాన్ని పూర్తిగా తగలబెట్టేశారని చెప్పారన్నారు.
మృతులకు కనీసం అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించలేనిస్థితిలో తాము ఉన్నామని, పట్టణంలోని వీధుల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. బాగా పట్టణంతోపాటు దానిని ఆనుకుని ఉన్న 16 గ్రామాలను బోకోహరామ్ ఉగ్రవాదులు తమ అధీనంలోకి తీసుకున్నారని బుకర్ చెప్పారు. ఉగ్రవాదులు శనివారమే దాడులు ప్రారంభించాయని, ఆ వెంటనే బాగాలోని సైనిక శిబిరాన్ని ప్రభుత్వ భద్రతా దళాలు తొలగించి వేశాయని ఆయన వివరించారు. ఈ శిబిరంలో నైజీరియా, చాడ్, నైగర్లకు చెందిన సైనికులు ఉన్నా దాడి సమయంలో నైజీరియా సైనికులు మాత్రమే ఉన్నారని తెలిపారు.
బాగా పట్టణం నుంచి వేలాదిమంది పక్కనే ఉన్న బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురి పట్టణానికి తరలి వెళ్లిపోయారని, మిగిలిన వారు చాడ్ పట్టణానికి వెళ్లిపోయారని వివరించారు. అలాగే, శనివారమే చాలామంది బాగా పట్టణం నుంచి చాడ్ సరస్సును దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నించారని, ఆ సమయంలోనే పెద్దఎత్తున ప్రజలు సరస్సులో మునిగిపోయారని వివరించారు. వాస్తవానికి, బోర్నోతోపాటు దానిపక్కనున్న రెండు రాష్ట్రాల్లో 2013లోనే నైజీరియా అధ్యక్షుడు గుడ్లక్ జోనాథన్ అత్యవసర పరిస్థితి విధించారు.