నేపాల్లో ఇండియన్ ఎంబసీ వద్ద బాంబు పేలుడు: ఐఎస్ఐ పనేనా?
ఖాఠ్మాండ్: నేపాల్లోని భారత దౌత్యకార్యాలయం వద్ద సోమవారం అర్ధరాత్రి పేలుడు సంభవించింది. బిరాట్నగర్లోని భారత ఎంబసీ కార్యాలయం వద్ద బాంబు పేలడంతో కార్యాలయ గోడలు స్వల్పంగా ధ్వంసమైనట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
సోమవారం అర్ధరాత్రి కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ స్థలంలో బాంబు పేలినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు ధాటికి భవనం గోడలు స్వల్పంగా ధ్వంసమైనట్లు తెలిపారు. పేలుడుకు గల కారణాలు, ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఓ రాజకీయ పార్టీ సోమవారం బిరాట్నగర్లో బంద్కు పిలుపినిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో స్థానిక రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరో వైపు ఐఎస్ఐ హస్తం ఏమైనా ఉందా? అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
బిరాట్నగర్.. బీహార్ సరిహద్దుకు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాగా, నేపాల్ ఎంబసీ వద్ద చిన్న పేలుడు జరిగిందని, ఆ సమయంలో కార్యాలయం ఎవరూ లేరని భారత అధికారులు తెలిపారు. నేపాల్లో, ఉత్తర బీహార్లో భారీ వరదలు వచ్చినప్పుడు తాత్కాలికంగా ఎంబసీ కార్యాలయం ఏర్పాటు చేశామని, అప్పటి నుంచి అది కొనసాగుతోందని అధికారులు తెలిపారు.