డొక్లాం ముక్కోణ జంక్షన్ ఇక సవాలే: డ్రాగన్తో భారత్ ‘సై’
భారత్-చైనా-భూటాన్ ముక్కోణ జంక్షన్ పరిధిలో చైనా బెదిరింపులకు భయపడి వెనుకకు తగ్గే ప్రసక్తే లేదని భారత ఆర్మీ తేల్చేసింది. వివాదాస్పద డోక్లామ్ ప్రాంతంలో టెంట్లు వేసుకొని సుదీర్ఘకాలం ఉండేలా ఏర్పాట్లు చేసు
న్యూఢిల్లీ: భారత్-చైనా-భూటాన్ ముక్కోణ జంక్షన్ పరిధిలో చైనా బెదిరింపులకు భయపడి వెనుకకు తగ్గే ప్రసక్తే లేదని భారత ఆర్మీ తేల్చేసింది. వివాదాస్పద డోక్లామ్ ప్రాంతంలో టెంట్లు వేసుకొని సుదీర్ఘకాలం ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నది. డోక్లామ్లోని భారత సైన్యానికి అవసరమైన సరుకుల రవాణా సాఫీగా కొనసాగుతున్నదని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
అదే సమయంలో సరిహద్దు సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొంటామని ధీమా వ్యక్తంచేశాయి. వెనుకకు తగ్గితేనే చర్చలు జరుపుతామన్న చైనా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనన్న గట్టి సంకేతాలు పంపినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సరిహద్దు సమస్యపై మరోవైపు చైనా కూడా ఏమాత్రం వెనుకకు తగ్గడం లేదు. రాజీ ప్రసక్తే లేదని, బంతి భారత్ కోర్టులో ఉన్నదని తేల్చి చెప్తున్నది. భారత్ తన సైన్యాన్ని వెనుకకు తీసుకుంటే తప్ప చర్చలకు తావు లేదని స్పష్టం చేస్తున్నది. ఇలా సరిహద్దు సమస్యలు ఏర్పడినప్పుడు వివిధ స్థాయిల్లో చర్చలు జరుపాలని, ఫ్లాగ్ మీటింగులతో శాంతియుత పరిష్కారం కనుగొనాలని భారత్, చైనా 2012లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. గతంలో 19 సార్లు చర్చలు జరిగాయి.
చైనా రోడ్డు నిర్మాణంతో సమస్య మొదలు
మూడు వారాలుగా రెండు దేశాల సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతున్నా పరిష్కారం చూపే దిశగా అడుగులు పడటం లేదు. ఈశాన్య రాష్ర్టాలను భారత్లోని మిగతా భూభాగానికి కలిపే కీలక ప్రాంతమైన ముక్కోణ జంక్షన్ వరకు రోడ్డు నిర్మించాలని చైనా ప్రయత్నించడంతో ఉద్రిక్తతలు మొదలైన సంగతి తెలిసిందే. చైనా రోడ్డు నిర్మాణం పూర్తయితే సైనికపరంగా ఆ దేశానికి ఎంతో ఉపయోగకరంగా మారుతుంది.
భూటాన్కు సాయం చైనాకు కంటగింపు
రక్షణ పరంగా, పాలనాపరంగా భారత్కు ఎన్నో సమస్యలు ఏర్పడుతాయి. ఈ నేపథ్యంలో చైనా తన ప్రతిపాదనను వెనక్కి తీసుకునేవరకు పరిస్థితిలో మార్పు ఉండదని భారత్ స్పష్టం చేసింది. మరోవైపు తాజా ఉద్రిక్తతలపై చర్చించేందుకు భూటాన్, చైనా సిద్ధమయ్యాయి. డోక్లామ్ ప్రాంతం భూటాన్ సరిహద్దులో ఉన్నది. ఈ ప్రాంతాన్ని భారత్ డోకాలా అని పిలుస్తుండగా, చైనా డోంగ్లాంగ్గా వ్యవహరిస్తున్నది. ప్రస్తుతం భూటాన్కు చైనాతో ఎటువంటి సంబంధాలు లేవు. భారత్తో సఖ్యంగా ఉంటూ ద్వైపాక్షిక, రక్షణ రంగ సహాయాన్ని పొందుతుండటం చైనాకు కంటగింపుగా మారింది. సిక్కిం సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో.. డోక్లామ్ నుంచి వెనక్కి తగ్గకూడదని భారత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. అక్కడే సుదీర్ఘంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నది. సైన్యానికి అవసరమైన సామగ్రిని పంపేందుకు ఆర్మీ అన్ని ఏర్పాట్లు చేసుకుంది.
సుదీర్ఘ నివాసానికి భారత ఆర్మీ ఏర్పాట్లు
డోంగ్లాంగ్ తమ ప్రాంతమని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని తాము పదే పదే హెచ్చరిస్తున్నా, భారత్ ససేమిరా అంటుండటం చైనాకు మింగుడుపడడంలేదు. పైగా అక్కడ టెంట్లు వేసుకుని సుదీర్ఘంగా ఇక్కడే ఉంటామన్న సంకేతాలు ఇవ్వడంతో డ్రాగన్ దేశం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నది. భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత నాలుగోవారానికి చేరింది. డోక్లాంలో రక్షణ పరంగా స్థిరంగా నిలబడిన భారత్, దౌత్యపరంగా మిత్రదేశాలన్నింటినీ ఏకం చేస్తున్నది. ‘మీరు స్థిరంగా ఉండండి. మీరు ఎదురుతిరిగేవరకు వాళ్లు గట్టిగా తోస్తూనే ఉంటారు. వాళ్లకు సెంటిమెంట్లేమీ లేవు. వారిని నిలువరించడానికి అంతర్జాతీయ నిబంధనలు సరిపోవు' అని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చైనా గురించి చెప్పిన మాటలు ఇక్కడ గమనార్హం.
నాణ్యతకే సైన్యం ప్రాధాన్యం
దేశీయ తుపాకులను ఆర్మీ తిరస్కరించిన నేపథ్యంలో అత్యాధునిక ఆయుధాల కొనుగోలు ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. కాలంచెల్లిన ఇన్సాస్ తుపాకుల స్థానే 1.85లక్షల హైకాలిబర్ తుపాకుల కొనుగోలుకు సిద్ధమైంది. సరిహద్దుల్లో అవసరాల కోసం 65వేల అత్యాధునిక తుపాకులు తక్షణమే కావాలన్న ఆర్మీ ఒత్తిడి మేరకు 20 ఆయుధ కంపెనీలతో చర్చించింది. వీలైనంత వేగంగా ఆయుధాలు దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. భారత ఆర్మీ తీవ్రమైన ఆయుధాల కొరతను ఎదుర్కొంటున్నది. గత నెలలో ఇచాపోర్ ప్రభుత్వ కర్మాగారం నుంచి వచ్చిన తుపాకులను తీసుకోవడానికి సైనికులు విముఖత వ్యక్తంచేశారు. నాణ్యతలేమి, తక్కువ పేలుడు సామర్థ్యం ఉన్న ఆ తుపాకులు తమ అవసరాలు తీర్చలేవని ఆర్మీ కూడా పేర్కొన్నది . బరువు తక్కువగా ఉండి 500 మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఆధునిక తుపాకులు అవసరమని స్పష్టంచేసింది. దీంతో ప్రభుత్వం అత్యాధునిక ఆయుధాల కొనుగోలుకు సిద్ధమైంది.
ఇలా సిలిగురి కారిడార్ కీలకం
ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలను మిగతా భారత్తో కలిసే సిలిగురి కారిడార్కు ఒక వైపు నేపాల్, మరోవైపు బంగ్లాదేశ్ సరిహద్దులు ఉన్నాయి. 200 కిలోమీటర్ల పొడవు, సగటున 60 కిలోమీటర్ల వెడల్పున్న భూభాగం. సిలిగురి కారిడార్ వెడల్పు ఒకచోటైతే 17 కిలోమీటర్లే. దీన్ని ఒకవేళ చైనా ఆధీనంలోకి తీసుకుంటే.. బెంగాల్లోని సిలిగురి, డార్జిలింగ్, జల్పాయ్గురిలతో పాటు ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు (సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర) దిగ్బంధనమైనట్లే. వీటిని చేరుకోవడానికి భారత్కు మరో రోడ్డు మార్గం లేదు. ఈశాన్య రాష్ట్రాలకు నలువైపులా చైనా, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్ దేశాలున్నాయి. జలమార్గం అసల్లేని ప్రాంతం. దాదాపు ఆరు కోట్ల మంది ప్రజలకు సరుకు రవాణా మార్గాలు మూసుకుంటాయి. మిగతా భారతావనితో సంబంధాలు తెగిపోతాయి. విమానాల ద్వారా మాత్రమే ఈశాన్యానికి చేరుకోగలం.
మెతక వైఖరి ప్రదర్శిస్తే కష్టాలే సుమా
కాబట్టి సిలిగురి కారిడార్ భౌగోళికంగా భారత్కు అత్యంత కీలకం. డోక్లాం నుంచి దాదాపు 130 కిలోమీటర్లు భారత భూభాగంలోకి చొచ్చుకు వస్తే చైనా ఆర్మీ సిలిగురి కారిడార్ను తమ ఆధీనంలోకి తీసుకోగలదు. అంతేకాక ఈశాన్యంలో చైనా సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న భారత సైనికులకు సరఫరాలు నిలిచిపోతాయి. కొత్తగా బలగాలను తరలించాలన్నా వీలుండదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొనే, అవసరమైతే చికెన్ నెక్ మాదిరిగా వ్యూహాత్మకంగా కీలకమైన ముక్కోణ జంక్షన్పై పట్టు సాధించాలని చైనా భావిస్తోంది.
ఈశాన్య భారతాన్ని కలిపే రైల్వే లైన్
ఈశాన్యానికి భారతీయ రైలు మార్గాన్ని అనుసంధానించే జంక్షన్ న్యూజల్పాయ్గురి రైల్వేస్టేషన్. అక్కడి నుంచి గౌహతితోపాటు పలు రాష్ట్రాలకు రైల్వే లింకు ఉంది. జాతీయ రహదారి 31 సిలిగురి- గౌహతిని కలుపుతుంది. రవాణా పరంగా ఈ రెండు మార్గాలు భారత్కు ఆయువు పట్టు వంటివి. అసోం నుంచి అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్కు రోడ్డుమార్గం ఉంది. వాస్తవాధీన రేఖకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తవాంగ్లో భారత సైన్యానికి చెందిన ఫోర్ కార్ప్స్ మొహరించి ఉంది. ఫోర్ కార్ప్స్లో 60 వేల మంది సైనికులు ఉంటారు.
ఈశాన్యంతో పాలనా వ్యవహారాలకు ఇలా ఆటంకం
న్యూజల్పాయ్గురి నుంచి దిమాపూర్ (నాగాలాండ్), దిబ్రూఘడ్ (ఉత్తర అస్సాం)లకు రైల్వే లైన్ ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గాల ద్వారా నాగాలాండ్, పశ్చిమ అరుణాచల్ప్రదేశ్ అనుసంధానం అవుతాయి. ఇక్కడ మరో 60 వేల మంది భారత సైనికులతో కూడిన త్రీ కార్ప్స్ ఉంది. సిక్కింలోని 33 కార్ప్స్ను కూడా రైల్వే అనుసంధానిస్తుంది. ఒకవేళ సిలిగురి కారిడార్ దిగ్బంధనం జరిగితే... భారత సైనికులకు ఆయుధ, నిత్యావసర సరఫరాలు మొత్తం నిలిచిపోతాయి. భారత సైన్యం అయోమయంలో పడుతుంది. రెండోది... పాలనావ్యవహారాలపై భారత్కు నేరుగా అజమాయిషీ లేని పరిస్థితి వస్తే... ఈశాన్యంలో సంక్షోభం ముదురుతుంది. పలు రాష్ట్రాల్లో వేర్పాటువాదులు, తీవ్రవాద సంస్థలు ఉన్నందున ఈశాన్యంలో శాంతిభద్రతలను కాపాడి.. పరిస్థితిని అదుపులో ఉంచడం కష్టతరమవుతుంది. కాబట్టి భారత్తో ఉద్రిక్తతలు పెరిగి యుద్ధానికి దారితీస్తే మొదట డ్రాగన్ వ్యూహాత్మకంగా చికెన్ నెక్ వంటి డొక్లాం ముక్కోణపు జంక్షన్ పైనే దృష్టి సారిస్తున్నది.
ఇదీ చైనా ముందస్తు వ్యూహం
సిక్కిం, భూటాన్ మధ్య చైనా భూబాగం చిన్న ద్వీపకల్పంగా చొచ్చుకు వచ్చినట్లు ఉంటుంది. యడాంగ్ నుంచి ట్రై జంక్షన్ వైపు వస్తున్న కొద్దీ కుంచించుకుపోతుంది. చైనా తమ బలగాలను భారత్ దిశగా ఇక్కడి చుంబీ లోయ గుండా ముందుకు నడపాల్సి ఉంటుంది. ఇది బాగా ఇరుకైన ప్రాంతమని, ఇటు సిక్కిం, అటు భుటాన్ (సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటే)లలో యుద్ధట్యాంకులు మొహరించి క్షిపణులను ప్రయోగించినా, వైమానిక దళాల ద్వారా బాంబు దాడులను దిగినా భారత్... చైనా సైన్యాన్ని కకావికలం చేయగలదని.. వ్యూహాత్మకంగా భారత్కు ఇది అనుకూలించే అంశమని సైనిక నిపుణుల అభిప్రాయం. చైనా సిలిగురి కారిడార్ను ఆక్రమిస్తే.. మనం చుంబీ లోయపై గురిపెట్టడం ద్వారా చైనా వెనక్కి తగ్గేలా చేయవచ్చని వారి అభిప్రాయం.
భారత్కూ కీలకం ఈ డొక్లాం పీఠభూమి
భూటాన్లో అంతర్భాగమైన డోక్లామ్ పీఠభూమిలో డోకాలా ఉంది. భారత్, చైనా, భూటాన్ దేశాల సరిహద్దులు కలిసే ‘ట్రై జంక్షన్'కు సమీపంలో ఉంది. తమ సరిహద్దులోని యడాంగ్ నుంచి డోకాలాకు రోడ్డు నిర్మిస్తే... అవసరమైనపుడు భారత సరిహద్దుల సమీపంలోకి అత్యంత వేగంగా చైనా బలగాలను, ట్యాంకులను తరలించేందుకు వీలుంటుందనేది డ్రాగన్ ఆలోచన. దీన్ని భారత్ వ్యతిరేకించి రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంది. ఫలితంగా చైనా- భారత్ల మధ్య తాజా ఉద్రిక్తతలు. భూటాన్తో మనకు 2007లో కుదిరిన ఒప్పందం ద్వారా... ఆ దేశ భద్రతకు మనం హామీదారుగా వ్యవహరిస్తున్నాం. అత్యంత సన్నిహితమైన మిత్రదేశానికి అండగా నిలవడం భారత్ ధర్మం. వ్యూహాత్మకంగా కూడా చైనా ఆర్మీ మన సరిహద్దులవైపు చొచ్చుకురాకుండా నిరోధించడం కూడా భారత్కు అవసరమే.