స్త్రీపై మరో ఉబేర్ డ్రైవర్ ఘోరం: బోస్టన్లో కారు డోర్ లాక్ చేసి...
బోస్టన్: న్యూఢిల్లీలో ఓ యువతి పైన ఉబేర్ క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. అది మరవకముందే బోస్టన్లో మరో ఉబేర్ క్యాబ్ డ్రైవర్ ఘాతుకానికి పాల్పడ్డ సంఘటన వెలుగు చూసింది. ఓ మహిళా ప్యాసింజర్ పైన బ్యాక్ సీట్లో అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఉబేర్ క్యాబ్ డ్రైవర్ అయిన అలెజాండ్రో (46) ఓ మహిళా ప్రయాణికురాలిని కారు ఎక్కించుకొని, ఎవరు లేని ప్రాంతానికి తీసుకు వెళ్లి, అక్కడ కారు డోర్లు లాక్ చేసి, బ్యాక్ సీటుకు వెళ్లి ఆమె పైన బలవంతం చేశాడు. ఈ సంఘటన డిసెంబర్ ఆరవ తేదీన జరిగింది.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఆమె తన ఫ్రెండ్స్తో కలిసి బయటకు వచ్చింది. ఇంటికి వెళ్లేందుకు ఉబేర్ ద్వారా కారును తీసుకుంది. ఆమె కారు ఎక్కిన తర్వాత డ్రైవర్ అలెజాండ్రో ఆమెతో క్యాష్ పే చేయాలని చెప్పాడు. దీంతో ఆమె ఏటీఎంకు వెళ్లి డబ్బులు తెచ్చింది. తిరిగి ఆమె కారు ఎక్కింది.
అక్కడి నుండి ఆమెను తెలియని ప్రాంతానికి తీసుకు వెళ్లాడు. అక్కడకు వెళ్లాక కారు డోర్లు లాక్ చేశాడు. బ్యాక్ సీటుకు వచ్చాడు. ఆమె అరవకుండా నోరు మూశాడు. ఆమెను లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతనిని బుధవారం అరెస్టు చేశారు.