అక్కడ ఏనుగులను ఎవరైనా వేటాడొచ్చు...నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం
ఆ దేశాల్లో సంఖ్యాపరంగా ఏనుగులు ఎక్కువే. దీంతో పంటపొలాల్లో ఏనుగుల దాడులు కూడా ఎక్కువైపోయాయి. ఇక గజరాజుల బెడద నుంచి తప్పించుకునేందుకు అందులోని ఓ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆదేశం ఏమిటి..? గజరాజుల బెడదను తగ్గించుకునేందుకు తీసుకున్న నిర్ణయం ఏమిటి..?
ఏనుగులను వేటాడొచ్చన్న బోట్స్వానా ప్రభుత్వం
బోట్స్వానా... దక్షిణాఫ్రికాలో ఓ చిన్న దేశం, దానికి సరిహద్దుగా జింబాబ్వే దేశం ఉంది. ఆ రెండు దేశాల్లో ఏనుగుల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. రెండు దేశాలకు సరిహద్దు సమస్యతో పాటు ఏనుగుల సమస్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. బోట్స్వానాలో 1,35,000 ఏనుగులు ఉన్నట్లు ఆ ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.అయితే వీటి బెడదనుంచి తప్పించుకునేందుకు బోట్స్వానా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ పర్యావరణ మరియు సహజవనరుల శాఖ ఏనుగులను వేటాడొచ్చు అంటూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు ఏనుగులను వేటాడటం పై నిషేధం ఉన్నింది. ఇప్పటి వరకు స్వేచ్ఛగా విహరించిన ఏనుగుల మందకు పాపం తెలీదు మరి కొన్ని రోజుల్లో అవి మానవుడి లాభానికి బలైపోతున్నాయని.
ఈ కఠిన నిర్ణయం తీసుకునేందుకు కారణాలు ఇవే
బోట్స్వానా ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకునేందుకు కారణాలు కొన్ని ఉన్నాయి. ఏనుగులు మనుషులపై దాడి చేయడం, పంటపొలాలను నాశనం చేస్తూ అక్కడి ప్రజల జీవనోపాధిని దెబ్బ తీస్తుండటం ఒక కారణంగా ప్రభుత్వం చెప్పింది. అంతేకాదు అక్కడి ప్రజల పశుపక్షాదులపై కూడా ఇవి దాడి చేస్తున్నాయని చెప్పింది.అక్కడ జాతీయ పార్కులు లేకపోవడంతో ఏనుగులు జనావాసాల్లోకి వచ్చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇక ప్రజల వెతలు తీర్చాలంటే... ఏనుగులను వేటాడటంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం ఒక్కటే మార్గం అని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఏనుగులను తుపాకులతో కాల్చివేయొచ్చనే ఆదేశాలు కూడా ప్రభుత్వం తన ప్రకటనలో పొందుపర్చింది.
పరిస్థితి ఇతర దేశాలకు ఏనుగులను అమ్ముతున్న జింబాబ్వే
ఇదిలా ఉంటే జింబాబ్వే మరోలా తన సమస్యను పరిష్కరించుకుంటోంది. ఏనుగులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం ఏనుగులను జింబాబ్వే దేశం అంగోలాకు ఎగుమతి చేస్తోంది. ఇక ఎవరికైనా ఏనుగులు కావాలంటే పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు జింబాబ్వే ప్రభుత్వం ప్రకటించింది. గతంలో కూడా జింబాబ్వే ఏనుగులను విక్రయించడం ద్వారా 2.7 మిలియన్ డాలర్లు సేకరించింది. అప్పట్లో చైనా, యూఏఈలకు అమ్మింది. ఇదిలా ఉంటే ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంతో నెటిజెన్లలో చీలిక వచ్చింది. కొందరు ప్రభుత్వం నిర్ణయంను వ్యతిరేకిస్తుండగా మరికొందరు మాత్రం ప్రజలు బతకాలంటే ఏనుగుల సమస్య ఉండకపోవడమే మంచిదంటూ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు.