కన్నతల్లి కిరాతకం: వేడినీళ్లలో ముంచి కొడుకుని చంపింది
అమర్యాదగా ప్రవర్తించినందుకు గాను నాలుగేళ్ల కొడుకుని ఓ సవతి తల్లి అత్యంత దారుణంగా చంపేసింది. ఈ ఘటన అమెరికాలోని ఓహియో పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... అన్నా రిట్చీ (25) అనే మహిళకు నాలుగేళ్ళ సవతి కొడుకు ఆస్టిన్ డెర్రెక్ కూపర్ ఉన్నాడు.
కూపర్ అంటే ఆమెకు మొదటి నుంచి కూడా చాలా చిరాకు, కోపం, కసి. ఆ బాలుడికి అనవసరంగా సేవలు చేస్తున్నానన్న భావం ఆమె మనసుని తీవ్రంగా తొలిచివేసేది. ఏ కారణం లేకపోయినా బాలుడిని చిత్రహింసలకు గురి చేసేది. చివరకు అతడి ప్రాణాలు తీసేవరకు ఆమె నిద్రపోలేదు.
ఒకరోజు ఆస్టిన్ కూపర్ తెల్లవారినా మంచంపై నుంచి నిద్ర మేలుకోలేదు. ఈ విషయాన్ని గమనించిన తండ్రి అతడి వద్దకు వెళ్లగానే బాలుడి కాళ్లు 80 శాతం వరకు కాలిపోయి మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ క్రమంలో ఆస్టిన్ను చూసిన తండ్రి వెంటనే ఆట్రియం మెడికల్ సెంటర్కు తీసుకెళ్లాడు.
ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వైద్యులు బాలుడు మృతి చెందినట్లు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సవతి తల్లి అన్నా రిట్చీని ప్రశ్నించారు. పోలీసుల విచారణలో సవతి తల్లి చెప్పిన విషయాలు ఆశ్చర్యపరిచాయి.
చనిపోవడానికి ముందు ఆ చిన్నారి అనుభవించిన ఆవేదనను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అన్నా రిట్చీ మాట్లాడుతూ తాను అంతకు ముందు రోజు కూపర్ కాళ్ళను కాగుతున్న వేడి నీటిలో ముంచి, శిక్షించినట్లు పేర్కొంది. ఆ తర్వాత వెంటనే బెడ్పైన పడుకోబెట్టినట్లు తెలిపింది. అన్నాపై కేసు నమోదు చేసి, కోర్టుకు తరలించారు.