మనసున్నమారాజులు: మూడో అంతస్తు నుంచి చిన్నారిని తోసేసిన దుండగుడు...మానవత్వం చాటుకున్న దాతలు
అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. ఎంతో ముద్దుముద్దుగా మాట్లాడే ఐదేళ్ల చిన్నారిని ఓ దుర్మార్గుడు షాపింగ్మాల్ 3వ అంతస్తు నుంచి కిందకు విసిరేశాడు. అంత ఎత్తునుంచి కిందకు పడేయడంతో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అసలు చిన్నారిని కిందకు తోసేసిన వ్యక్తి ఎవరు..? ఎందుకు తోసేశాడు..?
మూడో అంతస్తు నుంచి చిన్నారిని విసిరేసిన దుర్మార్గుడు
మినెసొట్టాలో నివాసం ఉండే ఐదేళ్ల బాలుడు లాండెన్ హఫ్మన్ స్థానిక షాపింగ్మాల్కు వెళ్లాడు. మాల్ను మొత్తం కలియతిరుగుతూ ఉన్నాడు. ఆటలు ఆడుతూ సంతోషంగా సమయాన్ని గడుపుతుండగా ఓ వ్యక్తికి కన్నుకుట్టినట్లయ్యింది. ఆ దుర్మార్గుడు లాండెన్ను ఎత్తుకుని షాపింగ్ మాల్లోని మూడవ అంతస్తు నుంచి కిందకు విసిరేశాడు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా కనిపించిన లాండెన్ చిరునవ్వు ఒక్కసారిగా మాయమైంద. తీవ్రగాయాలతో రక్తమోడుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడాడు. ఈ దృశ్యం చూసిన వారు కంటతడి పెట్టారు.
నిందితుడిని వెంటాడి పట్టుకున్న పోలీసులు
ఘటన చూసిన ప్రత్యక్ష సాక్షులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు బాలుడిని తోసేసిన వ్యక్తి కోసం వేట ప్రారంభించి పట్టుకున్నారు. అతని పేరు ఇమ్మానుయేల్ దిషాన్ అరాండా అని చెప్పారు. అతనిపై హత్యాయత్నం కేసును నమోదు చేశారు పోలీసులు. అబ్బాయిపై కానీ అతని కుటుంబంపై కానీ ఏదైనా పాత గొడవలు ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేశారు. అయితే చిన్నారికి గానీ అతని కుటుంబంకు కానీ ఇమ్మానుయేల్ అనే ఈ నిందితుడితో ఎలాంటి సంబంధాలు లేవు.
చిన్నారిని కాపాడేందుకు ముందుకొచ్చిన దాతలు
ప్రస్తుతం చిన్నారి ప్రాణాలు కాపాడే ప్రయత్నం వైద్యులు చేస్తున్నారు. అయితే లాండెన్ చికిత్సకు భారీగా ఖర్చు అవుతోంది. అంత డబ్బులు లాండెన్ తల్లిదండ్రుల దగ్గర లేవు. తన బిడ్డ బతకాలంటూ భారం అంతా భగవంతుడిపైనే వేశారు. మంచి వారికి ఎప్పుడూ మంచే జరుగుతుందంటారు. ఇదే విషయం లాండెన్ విషయంలో రుజువైంది. అతని చికిత్స కోసం తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేకపోవడంతో ఓ సామాజిక సంస్థ గోఫండ్మీ ముందుకొచ్చింది. తన ఆన్లైన్ వెబ్ పేజ్ ద్వారా చిన్నారికి జరిగిన నష్టాన్ని వివరించింది. లాండెన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యానికి అయ్యే ఖర్చును తోచినంతగా విరాళంగా ఇవ్వాలని తన వెబ్సైట్లో ప్రకటన ఇచ్చింది. అంతే చిన్నారి ప్రాణం కాపాడేందుకు పౌరులు ముందుకొచ్చారు. తమకు తోచినంతగా ఆన్లైన్ ద్వారా విరాళాలు ఇచ్చారు. ఇప్పుడు మొత్తం రూ.3 కోట్లకు పైగా డబ్బులు జమ అయ్యింది.
లాండెన్ చికిత్స కోసం విరాళంగా ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు చిన్నారి తల్లిదండ్రులు. "నా బిడ్డ బతికితే అది మీ వల్లనే" అని చెబుతూ చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.