కరోనా టెస్టుల వల్ల ఊపిరి తిత్తులు క్లీన్ అయ్యాయట: దేశాధ్యక్షుడి వింత వాదన: అందుకే లక్షల్లో
బ్రసీలియా: ప్రాణాంతక కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఏ రేంజ్లో చుట్టబెట్టిందో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేని పరిస్థితి. ప్రస్తుతం ఈ వైరస్ బారిన పడని దేశమంటూ ప్రపంచపటంలో ఏదీ లేదు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి అగ్రారాజ్యాలు సైతం కరోనా వైరస్ ముందు మోకరిల్లాయి. కుదేల్ అవుతున్నాయి. ఎప్పటికి తేరుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. కరోనా ప్రభావం సుదీర్ఘకాలం పాటు కొనసాగడం ఖాయమంటూ శాస్త్రవేత్తలు సైతం హెచ్చరిస్తున్నారు.
కరోనా వైరస్పై అన్ని దేశాలు కూడా ఓ యుద్ధాన్నే కొనసాగిస్తున్నాయి. కంటికి కనిపించని శతృవుతో ఎడతెగని పోరాటాన్ని సాగిస్తున్నాయి. ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందడాన్ని ఏ మాత్రం తేలిగ్గా తీసుకోవడానికి సిద్ధంగా లేదు ఏ దేశం కూడా. బ్రెజిల్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ప్రస్తుతం అమెరికా తరువాత ఆ స్థాయిలో తీవ్రంగా దెబ్బతిన్న దేశం ఏదైనా ఉందంటే అది బ్రెజిల్ ఒక్కటే. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, దీని వల్ల సంభవించిన మరణాలతో ప్రపంచ దేశాల్లో రెండోస్థానంలో కొనసాగుతోంది బ్రెజిల్.
అలాంటి దేశానికి సారథ్యాన్ని వహిస్తోన్న అధ్యక్షుడు జైర్ బొల్సొనారో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనడానికి తాజా ఉదాహరణ ఇది. తరచూ కరోనా వైరస్ పరీక్షలను చేయించుకోవడం వల్ల తన ఊపిరి తిత్తులు క్లీన్ అయ్యాయంటూ ఆయన చెప్పారు. కరోనా వైరస్ పెద్ద ఎత్తున వ్యాప్తి చెందిన నేపథ్యంలో ఆయన రెండుసార్లు కరోనా టెస్టులను చేయించుకున్నారు. రెండుసార్లు కూడా నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. తనకు కరోనా నెగిటివ్ రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
జ్వరం వంటి కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో బొల్సొనారోకు కరోనా పరీక్షలను నిర్వహించినట్లు సీఎన్ఎన్ బ్రెజిల్, ఎస్టాడో డీ ఎస్ పాలో పత్రిక దీనిపై ఓ కథనాన్ని ప్రచురించాయి. రెండోసారి కూడా బొల్సొనారోకు నెగెటివ్ రిపోర్ట్ వచ్చినట్లు పేర్కొన్నాయి. అదే సమయంలో.. ఆయన ఇచ్చిన ఓ స్టేట్మెంట్కు ప్రాధాన్యత ఇచ్చాయి. రెండుసార్లు తాను కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నానని, ఫలితంగా తన లంగ్స్ క్లీన్ అయ్యాయని చెప్పుకొచ్చారు. రెండుసార్లూ నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని అన్నారు.
యథా రాజ తథా ప్రజా అన్నట్లు కరోనా తీవ్రతను దేశాధ్యక్షుడే తేలిగ్గా తీసుకున్నందున.. బ్రెజిలియన్లు కూడా దీన్ని లైట్గానే భావిస్తున్నారు. అందుకేనేమో- ఆ దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం బ్రెజిల్లో 16,26,071 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 65,556 మంది మరణించారు. ఈ సంఖ్య ఇప్పట్లో ఆగేలా కూడా కనిపించట్లేదు. అమెరికా తరువాత బ్రెజిల్ రెండోస్థానంలో కొనసాగుతోంది. మూడో స్థానాన్ని భారత్ ఆక్రమించింది.