బాత్రూంలో కిందపడి.. గతం మర్చిపోయిన దేశ అధ్యక్షుడు!
బ్రెసిలియా: తన నివాసంలో కాలుజారి పడిపోవడంతో గతం మర్చిపోయారు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో. కొద్ది గంటలపాటు గతం పూర్తిగా మర్చిపోయిన ఆయన.. ఆ తర్వాత కొద్ది సేపటికి తిరిగి వాస్తవ లోకంలోకి వచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు జైర్ బోల్సోనారో.
బాత్రూంలో కాలుజారి..
వివరాల్లోకి వెళితే.. గత సోమవారం రాత్రి అల్వొరాడా ప్యాలెస్లోని తన బాత్రూంలో కాలు జారిపడ్డారు 64ఏళ్ల బోల్సోనారో. దీంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం ఆయన పూర్తిగా కోలుకున్నారు.
కాగా, ఒక్క రాత్రంతా ఆస్పత్రిలోనే ఉన్న బోల్సోనారో మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు.
గతం మర్చిపోయారు..
అయితే, ఈ ఘటనపై ఇటీవలో ఇంటర్వ్యూలో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బాత్రూంలో కాలు జారడంతో వెనక్కి పడిపోయానని.. దీంతో తలకు దెబ్బ తగిలిందని చెప్పారు అధ్యక్షుడు. ఆ తర్వాత కొద్దిసేపటి వరకు తాను గతం మొత్తం మర్చిపోయానని తెలిపారు. తనకు ఒక రోజు ముందు ఏం జరిగిందో కూడా గుర్తు లేదని చెప్పారు.
మరుసటి రోజుకి అంతా ఒకే..
అయితే, ఆ మరుసటి రోజైన మంగళవారం ఉదయానికి చాలా విషయాలు గుర్తుకు తెచ్చుకున్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని జైర్ వెల్లడించారు. కాగా, 2018 సెప్టెంబర్లో అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో బోల్సోనారోపై కత్తితో దాడి జరిగింది. దీంతో అప్పుడు ఆయన తీవ్రంగా గాయపడ్డారు. నాలుగు సర్జరీల తర్వాత ఆయన కోలుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే, ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని జైర్ వెల్లడించారు.