అట్టహాసంగా బ్రిక్స్: మోడీతో జిన్పింగ్ కరచాలనం.. స్వయంగా ఆహ్వానం!
ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం చైనాలోని జియామెన్ నగరంలో బ్రిక్స్ సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది.
బీజింగ్: డోక్లాం వివాదం నేపథ్యంలో బ్రిక్స్ తొమ్మిదో శిఖరాగ్ర సదస్సును ప్రపంచ దేశాలన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికపై చైనా-భారత్ పరస్పర ఆరోపణలకు దిగుతాయా? లేక మైత్రిపూర్వక వాతావరణంలోనే సదస్సును ముగిస్తాయా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం చైనాలోని జియామెన్ నగరంలో బ్రిక్స్ సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా బ్రిక్స్ దేశాల అధినేతలంతా గ్రూప్ ఫోటో దిగారు. రెడ్ కార్పెట్ పై ప్రధాని మోడీ సహా బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా దేశాధినేతలను స్వయంగా ఆహ్వానించిన జిన్ పింగ్.. మోడీతో కరచాలనం చేశారు.
తొలుత చైనా అధ్యక్షుడు వేదిక వద్దకు చేరుకోగా.. ఆ తర్వాత మరో దేశాధ్యక్షుడు వచ్చారు. మూడో నేతగా ప్రధాని మోడీ, ఆయన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ సదస్సు వేదిక వద్దకు వచ్చారు. మంగళవారం నాడు ప్రధాని మోడీ జిన్ పింగ్ తో భేటీ అయి భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.
కాగా, సదస్సు ఆసాంతం శాంతియుతంగా చర్చలు జరగాలని బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు ఆకాంక్షిస్తున్నాయి. స్నేహపూర్వకంగా వివాదాలను పరిష్కరించుకోవాలని భావిస్తున్నాయి.'మెరుగైన భవిష్యత్తుకు బలమైన భాగస్వామ్యం' అన్న కాన్సెప్టుతో ఈ దఫా సదస్సును నిర్వహిస్తున్నారు.