ఎవరెస్ట్ అధిరోహకులూ ఖాళీ ఆక్సిజన్ ట్యాంక్స్ తిరిగి తీసుకురండి: నేపాల్ రిక్వెస్ట్, ఎందుకంటే.?
ఖాట్మాండ్: నేపాల్ దేశంలోనూ కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. దీంతో కరోనా బాధితులు పెరిగిపోయి ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఈ క్రమంలో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత కోసం నేపాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు చర్యలు తీసుకున్న ప్రభుత్వం తాజాగా, మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఖాళీ సిలిండర్లు హిమాలయాలపైనే వదిలేయొద్దు..
ఎవరెస్ట్ శిఖరం అధిరోహించేవారు తమ వెంట తీసుకెళ్లే ఆక్సిజన్ ట్యాంకులను అక్కడే వదిలేసి రాకుండా తిరిగి తీసుకురావాలని నేపాల్ ప్రభుత్వం కోరింది. ఎవరెస్ట్ సాహసయాత్రకు వెళ్లేవారు ఆక్సిజన్ ట్యాంకులను అక్కడే వదిలివేయకుండా తమ వెంట తిరిగి తీసుకురావాలని నేపాల్ మౌంటెనీరింగ్ అసోసియేషన్(ఎన్ఎంఏ) అధికారులు వారిని కోరారు.
ఆ ఆక్సిజన్ ట్యాంకులు ఎంతో ఉపయోగపడతాయంటున్న నేపాల్
ఈ సీజన్లో ఎవరెస్ట్ అధిరోహకులు, వారి సహాయకులు దాదాపు 3500 ఆక్సిజన్ బాటిళ్లను తీసుకెళ్లి ఉంటారని అంచనా. సాహసయాత్ర పూర్తికాగానే సాధారణంగా వీటిని పర్వతాల్లోనే వదిలేస్తుంటారు. అయితే, ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో ఆ ఆక్సిజన్ ట్యాంకులు ఎంతో ఉపయోగపడతాయి. అందుకే సాహసయాత్రికులను తిరిగి ఆక్సిజన్ బాటిళ్లు, ట్యాంకులను తిరిగి తమ వెంట తీసుకురావాలని కోరుతున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కష్టకాలంలో చైనా సాయం చేస్తామని హామీ నేపాల్ మంత్రి చెప్పుకొచ్చారు.
Recommended Video
25వేల ఆక్సిజన్ సిలిండర్లు అవసరమంటున్న నేపాల్
కాగా, నేపాల్ దేశంలో ఆదివారం దాదాపు 9వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ నెలలో నమోదైన రోజువారీ కేసుల కంటే ఈ సంఖ్య 30 రేట్లు అధికం కావడం గమనార్హం. నేపాల్లో ఇప్పటి వరకు 3.9 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, 3720 మంది కరోనాతో మరణించారు. కేసుల సంఖ్య పెరగడం, ఆక్సిజన్ కొరత కారణంగా ఎక్కువ మంది రోగులను చేర్చుకోలేకపోతున్నామని నేపాల్ రాజధాని ఖాట్మాండ్ లోని ప్రైవేటు ఆస్పత్రులు చెబుతున్నాయి.
సుమారు 25వేల ఆక్సిజన్ సిలిండర్ల అవసరముందని వారంటున్నారు. ప్రభుత్వం తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, ఇప్పటికే భారత్ ఆక్సిజన్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. స్వదేశంలో ఉత్పత్తితోపాటు విదేశాల నుంచి భారీ ఎత్తున ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లను తెప్పించుకుంటోంది.