యూకేలో సెకెండ్వేవ్: మృత్యుముఖంలోకి బ్రిటన్: చలికాలం: లక్ష మంది ప్రాణాలకు నో గ్యారంటీ
లండన్: ప్రపంచాన్ని చుట్టుబెట్టేసిన కరోనా వైరస్ భవిష్యత్తులో మరింత విజృంభించబోతోంది. కొన్ని దేశాలను మృత్యుముఖంలోకి నెట్టేయబోతోంది. ఇప్పటికే లక్షా 30 వేల మందికి పైగా అమెరికన్లను బలి తీసుకున్న కరోనా మహమ్మారి.. యూరోపియన్ దేశాలపై పంజా విసరబోతోంది. చలికాలం ముగిసే సరికి ఒక్క బ్రిటన్లోనే లక్షా 20 వేల మందిని పొట్టన పెట్టుకునే ప్రమాదం ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో కరోనా వైరస్ బ్రిటన్లో భయానకంగా వ్యాప్తి చెందుతుందని సూచిస్తున్నారు. శీతాకాలంలో కరోనా వైరస్ బలపడుతుందని, బ్రిటీష్ పౌరులు స్వీయ గృహ నిర్బంధంలో ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
జగన్ డ్రీమ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్: స్టే ఎత్తివేత.. టెండర్ల ప్రక్రియకు ఓకే: కేంద్రానికి నోటీస్
బ్రిటన్లో ఇప్పటికే 44 వేల మందికి పైగా..
కరోనా వైరస్ వల్ల ఇప్పటికే బ్రిటన్ దారుణంగా దెబ్బతిన్నది. 44 వేల 830 మంది ఈ వైరస్ బారిన పడి మరణించారు. 2,90,133 మంది అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రుల పాలయ్యారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం కరోనా వల్ల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. మృత్యుముఖంలోకి వెళ్లి మరీ.. ఆయన వెనక్కి వచ్చారు. 10 రోజుల పాటు హోమ్ ఐసొలేషన్లో ఉన్న బోరిస్ జాన్సన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో ఐసీయూలో చేర్చారు. రెండువారాల చికిత్స అనంతరం ఆయన కోలుకుని, ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు.
చలికాలంలో మృత్యుముఖంలో..
అలాంటి ప్రమాదకర పరిస్థితుల మధ్య ఉన్న బ్రిటన్.. వచ్చే చలికాలంలో మరింత అధ్వాన్న స్థితికి దిగజారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో కరోనా వైరస్ మరణాలు భారీగా పెరుగే ప్రమాదం ఉందంటూ బ్రిటన్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఎంఎస్) ప్రొఫెసర్ స్టీఫెన్ హోల్గెట్ అంచనా వేశారు. చలికాలం ముగిసే సరికి కనీసం లక్షా 20 వేల మంది బ్రిటీష్ పౌరులు కరోనా వైరస్ వల్ల మరణించే ప్రమాదం ఉందంటూ చెప్పారు. చలికాలంలో సెకెండ్ వేవ్ ఆరంభం కావడం ఖాయంగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ముందు జాగ్రత్త చర్యలతోనే
ఇది తన అంచనా మాత్రమే కాదని.. వాస్తవ రూపం దాల్చడానికి వందశాతం అవకాశం ఉందని స్టీఫెన్ చెప్పుకొచ్చారు. దీన్ని నివారించడానికి ప్రజలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. స్వీయ గృహ నిర్బంధంలో ఉండటం, కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించడం వల్ల మరణాల సంఖ్యను నియంత్రించవచ్చని చెప్పారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. కరోనాకు బలి కాకతప్పదని అన్నారు. బ్రిటన్లో ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు, కరోనా రేట్ వాల్యూను లెక్కిస్తే.. వచ్చే సెప్టెంబర్ నాటికి దేశంలో దారుణ పరిస్థితులు ఏర్పడే సంకేతాలను ఇస్తున్నాయని అన్నారు.
Recommended Video
సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు
ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు కరోనా వల్ల ఆసుపత్రుల్లో మరణించే వారి సంఖ్య 1,19,000లకు చేరుకోవచ్చని స్టీఫెన్ అంచనా వేశారు. బ్రిటన్లో కనిపించిన ఫస్ట్ వేవ్ కంటే.. కూడా చలికాలంలో ఆరంభం అయ్యే సెకెండ్ వేవ్లో మరణాల సంఖ్య రెట్టింపు అవుతుందని చెప్పారు. సాధారణంగా చలికాలంలో ఫ్లూ విజృంభిస్తుంటుందని, ఈ సారి దానికి తోడు కరోనా వైరస్ తోడు కావడం వల్ల పేషెంట్ల సంఖ్య భారీగా పెరగడం ఖాయమని ఏఎంఎస్ ఉపాధ్యక్షురాలు అన్నే జాన్సన్ అంచనా వేశారు. కరోనా వైరస్ ఇప్పట్లో పోయేది కాదని స్పష్టం చేశారు.