ట్రంప్ ది పనికి మాలిన పాలన అన్న బ్రిటన్..!ఘాటుగా స్పందించిన యూఎస్ ప్రసిడెంట్..!!
వాషింగ్టన్/హైదరాబాద్: బ్రిటన్ అమెరికా మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. రెండు దేశాలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అద్యక్షుడు ట్రంప్ పై బ్రిటన్ చేసిన వ్యాఖ్యల పట్ల దుమారం రేగుతోంది. ఇదే అంశం పై అమెరికా అద్యక్షుడు కూడా స్పందించారు. తన పాలనపై బ్రిటన్ రాయబారి కిమ్ డరోచ్ చేసిన ప్రతికూల వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. డరోచ్ యూకేకు సరైన సమాచారం అందించలేదని పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.
'నేను ఇంకా వాటిని(డరోచ్ వ్యాఖ్యల్ని) చూడలేదు. కానీ, కొన్ని దేశాలతో మా సంబంధాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సాగుతాయి. ఇలాంటి నేపథ్యంలో యూకే ప్రభుత్వానికి వారి రాయబారి సరైన సమాచారం అందించలేదని మాత్రం చెప్పగలను. మేం ఆయన(డరోచ్)కు పెద్ద అభిమానులం కాదు. అందుకే ఆయన సరైన సమాచారం ఇవ్వలేదని భావిస్తున్నాం.
మేం దాన్ని అర్థం చేసుకోగలం. నేనూ ఆయన గురించి చెప్పగలను. కానీ అలాంటి వాటిని నేను పెద్దగా పట్టించుకోను' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పాలన అత్యంత ఘోరంగా ఉందని అమెరికాలోని బ్రిటన్ రాయబారి సర్ కిమ్ డరోచ్ పేర్కొన్న విషయం తెలిసిందే. బ్రిటన్కు పంపిన రహస్య సందేశంలో ట్రంప్ పాలనపై డరోచ్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు ది మెయిల్ పత్రిక బయటపెట్టింది. దీన్ని బ్రిటన్కు చెందిన ఓ మంత్రి సైతం ధ్రువీకరించినట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ పేర్కొంది.
'ట్రంప్ పాలన పనికిమాలిన, అభద్రత' 'అసమర్థం' గా ఉంది. ఇరాన్ విషయంలోనూ అమెరికా విధానం అస్తవ్యస్తంగా..ఒక దిశానిర్దేశం లేకుండా ఉంది. శ్వేతసౌధంలో విభేదాలు సైతం తారస్థాయిలో ఉన్నాయి' అని డరోచ్ పేర్కొన్నట్లు దిమెయిల్ ప్రచురించింది. బ్రిటన్లో నూతన ప్రధాని ఎన్నిక కానున్న తరుణంలో ఇలాంటి విషయాలు బయటకు రావడం ఇరు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మద్య మరింత రాజకీయ వేడిని రగిల్చాయి.