పైలెట్ల మెరుపు సమ్మె: బ్రిటీష్ ఎయిర్ వేస్ విమాన సర్వీసులన్నీ రద్దు..ప్రయాణికుల పడిగాపులు!
లండన్: ప్రపంచంలోనే అతి ఖరీదైన పౌర విమానయాన సంస్థల్లో ఒకటైన బ్రిటీష్ ఎయిర్ వేస్.. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో పడినట్టు కనిపిస్తోంది. బ్రిటీష్ ఎయిర్ వేస్ విమాన సంస్థలో పనిచేస్తోన్న పైలెట్లందరూ మెరుపు సమ్మెకు దిగారు. బ్రిటన్ కాలమానం ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ సమ్మె మొదలైంది. 48 గంటల పాటు కొనసాగుతుంది. ఒక్క పైలెట్ కూడా విధి నిర్వహణలో లేరు. ఫలితంగా- ప్రపంచవ్యాప్తంగా బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానాలన్నీ నేల వాలాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సంస్థ యాజమాన్యం విమాన సర్వీసులన్నింటినీ రద్దు చేసింది. దీని ప్రభావం- ప్రయాణికులపై తీవ్రంగా పడింది. లండన్ లోని ప్రతిష్ఠాత్మక హీత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో వందలాది మంది ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు.
ల్యాండర్ ఆచూకీ దొరికినా..: చంద్రయాన్-2పై ఇస్రో శాస్త్రవేత్త కీలక వ్యాఖ్యలు
పైలెట్ల డిమాండ్ ఏంటీ?
సంస్థ సాధిస్తోన్న వార్షిక ఆదాయానికి అనుగుణంగా తమకు వేతనాలను పెంచాలనేది పైలెట్ల ప్రధాన డిామాండ్. తమ కష్టార్జితం వల్ల సంస్థ యాజమాన్యానికి ఏటేటా మంచి లాభాలు అందుతున్నాయని, దానికి అనుగుణంగా తమ జీతాలను పెంచడంలో తప్పేముందని వారు చెబుతున్నారు. తమకు ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీలను అందించకపోతే.. ఏ క్షణమైనా మెరుపు సమ్మె (ఇండస్ట్రీయల్ యాక్షన్)కు దిగుతామని వారు కొద్దిరోజుల కిందటే హెచ్చరించారు. దీనికి సంబంధించి బ్రిటీష్ ఎయిర్ వేస్ పైలెట్ల అసోసియేషన్ (బీఏఎల్పీఏ) ప్రధాన కార్యదర్శి బ్రియాన్ స్ట్రుట్టర్న్ లిఖితపూరకంగా సంస్థ యాజమాన్యానికి సమ్మె నోటీసును అందజేశారు. నిజానికి ఈ నెల 27వ తేదీన సమ్మె చేపడతామనే విషయాన్ని పైలెట్లు అందులో పొందుపరిచారు. అయినప్పటికీ.. ఉన్నట్టుండి సోమవారం నుంచి సమ్మెకు దిగారు. తమ విధులను బహిష్కరించారు. ఏ ఒక్క పైలెట్ కూడా విధి నిర్వహణలో పాల్గొనలేదని పైలెట్ల అసోసియేషన్ వెల్లడించింది.
ప్రత్యామ్నాయం చేపట్టడంలో విఫలం..
సమ్మె ప్రభావం ప్రయాణికులపై తీవ్రంగా పడింది. లండన్ సహా పలు బ్రిటన్ లోని పలు నగరాల్లో ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడిగాపులు పడుతున్నారు. విమాన సర్వీసుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రత్యామ్నాయ రవాణా వసతిని కల్పించడంలో బ్రిటీష్ ఎయిర్ వేస్ సంస్థ యాజమాన్యం దారుణంగా విఫలమైందని అంటూ వారు ఆక్రోశిస్తున్నారు. తమకు కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదని, ముందే తెలిసి ఉంటే ఇతర విమానాల్లో ప్రయాణించి ఉండే వాళ్లమని చెబుతున్నారు ప్రయాణికులు. లండన్ లోని హీత్రూ అంతర్జాతీయ విమానాశ్రయం.. వందలాదిమంది ప్రయణికులతో నిండిపోయింది. కిటకిటలాడుతోంది. వారిలో దాదాపు 80 శాతం మంది ప్రయాణికులు బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానాల్లో రాకపోకలు సాగించాల్సిన వారే.
సమ్మె నివారణ చర్యలు విఫలం..
సమ్మెను నివారించడానికి బ్రిటీష్ ఎయిర్ వేస్ పైలెట్ల అసోసియేషన్ తో సంస్థ యాజమాన్యం ఓ దఫా చర్చలను నిర్వహించింది. ఈ నెల 4వ తేదీన అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమైంది. అసోసియేషన్ ప్రతినిధుల డిమాండ్లపై ఏ నిర్ణయాన్నీ తీసుకోలేకపోయింది. దీనితో చర్చలు అర్ధాంతరంగా వాయిదా పడ్డాయి. చర్చలు అసంపూర్తిగా ముగిసిన నాలుగు రోజుల్లోనే పైలెట్లందరూ మూకుమ్మడిగా సమ్మెకు దిగారు. కాగా.. మరో దఫా అసోసియేషన్ ప్రతినిధులతో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ అధికార ప్రతినిధురాలు వెల్లడించారు. పైలెట్ల డిమాండ్లు మరీ తీర్చలేనివిగా ఉన్నాయనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను వారు పున:సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే సమ్మెను విరమించుకోవాలని కోరారు. ఇప్పటికే తాము మంచి ప్యాకేజీని అందజేస్తున్నామని అన్నారు.
ఒక్క హీత్రూ ఎయిర్ పోర్టులోనే 800 విమానాలు నేలపై
ఒక్క హీత్రూ విమానాశ్రయంలోనే 800లకు పైగా విమానాలు నేలకు వాలాయి. షెడ్లకు పరిమితం అయ్యాయి. దీనితోపాటు- ఆ సంస్థకు చెందిన 4,800 మంది క్షేత్రస్థాయి సిబ్బంది సైతం విధులకు గైర్హాజరయ్యారు. పైలెట్ల సమ్మెకు తాము మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. వందలాది మంది ప్రయాణికులు ఒక్కసారిగా పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో హీత్రూ విమానాశ్రయంలో ఉద్రిక్తత నెలకొంది. పలువురు ప్రయాణికులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. బ్రిటీష్ ఎయిర్ వేస్ సంస్థ యాజమాన్యంపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రత్యామ్నాయ రవాణా వసతిని కల్పించడంలో యాజమాన్యం విఫలమైందని ఆరోపిస్తున్నారు. సమ్మెపై ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ నిలదీస్తున్నారు.