రైతుల ఉద్యమాన్ని పాకిస్తాన్తో లింకు పెట్టిన బ్రిటన్ ప్రభుత్వం: దౌత్యపరంగా పరిష్కరించుకోవాలట
లండన్: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు వారాలుగా రైతుల నిరసన దీక్షలను కొనసాగిస్తున్నారు. దేశ రాజధానిని ముట్టడించారు. రహదారులను దిగ్బంధించారు. వారి డిమాండ్లను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు ఫలించట్లేదు. కేంద్రం సూచిస్తోన్న ప్రత్యామ్నాయాలను రైతులు అంగీకరించట్లేదు. ఈ పరిణామాల మధ్య సుదీర్ఘకాలం పాటు రైతులు చేస్తోన్న ఆందోళనలు ప్రపంచ దేశాల దృష్టిని తమవైపు తిప్పుకొంటున్నాయి. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో.. రైతులకు మద్దతుగా గళం విప్పారు.
గందరగోళంలో బోరిస్ జాన్సన్..
తాజాగా- బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కూడా రైతుల ఉద్యమానికి అండగా నిలిచారు. రైతుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక్కడే ఆయన పొరపడ్డారు. రైతుల ఆందోళనలను భారత్-పాకిస్తాన్ మధ్య వివాదంగా భావించారు. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి రెండు దేశాలు ప్రయత్నించాలని సూచించారు. దౌత్యపరంగా, ద్వైపాక్షిక చర్చల ద్వారా దీనికి పరిష్కారాన్ని కనుగొనాలని చెప్పారు. ఆ దేశ పార్లమెంట్లో బోరిస్ జాన్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అవి కాస్తా వైరల్గా మారాయి. అనంతరం దీనిపై బ్రిటన్ అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు.
సిక్ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ..
లేబర్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు తన్మన్ సింగ్ దేశీ.. ఈ అంశాన్ని లేవనెత్తారు. సిక్కుల సామాజిక వర్గానికి చెందిన నేత. లక్షలాది మంది రైతులు రోజుల తరబడి భారత్లో నిరసన దీక్షలను చేపట్టారని, దీనిపై ప్రపంచ దేశాలు తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాయని చెప్పారు. వ్యవసాయ రంగంలో కార్పొరేట్లు ప్రవేశించడానికి వీలుగా భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు చట్టాల పట్ల రైతులు నిరసన ప్రదర్శనలను కొనసాగిస్తున్నారని సభలో ప్రస్తావించారు. ఈ దీక్షకు మద్దతు ప్రకటించాలని ఆయన బోరిస్ జాన్సన్కు విజ్ఞప్తి చేశారు.
ప్రతిష్ఠంభన తొలగించేలా..
బ్రిటన్ తరఫున భారత ప్రధానమంత్రితో మాట్లాడాలని ఆయన సూచించారు. రైతాంగ ఉద్యమానికి నైతిక మద్దతును ప్రకటించాలని, సంఘీభావాన్ని వ్యక్తం చేయాలని కోరారు. దీనిపై సభలో ఓ ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతుల ప్రతినిధులతో భారత ప్రభుత్వం చేపట్టిన చర్చల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతోందని చెప్పారు. దీన్ని తొలగించేలా భారత ప్రధానితో మాట్లాడాలని, తద్వారా.. బ్రిటన్ ప్రజలు భారత రైతుల వెంట ఉన్నారనే సందేశాన్ని ఇచ్చినట్టవుతుందని అన్నారు.
భారత్-పాక్ మధ్య వివాదంగా..
దీనికి బోరిస్ జాన్సన్ బదులిస్తూ.. భారత్-పాకిస్తాన్ మధ్య ఈ తరహా వాతావరణం ఏర్పడటం ఏ మాత్రం మంచిది కాదని వ్యాఖ్యానించారు. దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచం మొత్తానికీ తెలిసిన ఈ వివాదాన్ని భారత్-పాకిస్తాన్ ప్రభుత్వాలు సామరస్యపూరకంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా రెండు ప్రభుత్వాలు తీసుకునే ఎలాంటి చర్యలనైనా బ్రిటన్ ప్రభుత్వం సమర్థిస్తుందని అన్నారు. బోరిస్ జాన్సన్ ఈ సమాధానం ఇచ్చే సమయంలో తన్మన్ సింగ్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
Recommended Video
క్లారిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం..
బోరిస్ జాన్సన్ నిండు సభలో చేసిన ఈ వ్యాఖ్యల పట్ల బ్రిటన్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రధానికి ముందస్తుగా ఇచ్చిన సమాచారంలో పొరపాటు చేసుకున్నట్లు అధికార ప్రతినిధి తెలిపారు. రైతుల ఉద్యమంపై ఆయనకు ముందస్తు సమాచారం లేదని పేర్కొన్నారు. సమాచార లోపం వల్లే బోరిస్ జాన్సన్.. ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని చెప్పారు. భారత్లో కొనసాగుతోన్న రైతుల ఉద్యమాన్ని తమదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని అన్నారు.