మరింత సమయం కావాలి: నేతాజీ ఫైళ్లపై బ్రిటిష్
లండన్: స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ రహస్య ఫైళ్ల వెల్లడి నిర్ణయానికి మరింత సమయం కావాలని బ్రిటన్ ప్రభుత్వం కోరింది. 1945లో నేతాజీ ఆకస్మిక అదృశ్యానికి సంబంధించిన అన్ని ఫైళ్ల్లను ప్రజల కోసం బహిర్గత పర్చాలని ఇటీవల కోరారు.
అదృశ్య ఫైళ్లన్నింటినీ బహిర్గతం చేయాలని నేతాజీ కుటుంబం బ్రిటన్ అధికారులను ఆశ్రయించింది. తన సోదరి మాధురి బోస్ యూకే ప్రభుత్వాన్ని ఆశ్రయించగా తమ వద్ద నేతాజీ ఫైళ్లు ఉన్నాయని చెప్పారని నేతాజీ మేనల్లుడు సూర్యకుమార్ బోస్ మీడియాకు తెలిపారు.
అయితే, వాటి వెల్లడికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడానికి మరింత సమయం కావాలని వారు ఆమెకు పలుమార్లు తెలిపారన్నారు. తమ వద్ద ఉన్న నేతాజీ దస్త్రాలను బయటపెట్టాల్సిందిగా అమెరికా, రష్యా, జపాన్ దేశాలను చంద్రబోస్ కుటుంబసభ్యులు కోరుతున్నారు.
రెండో ప్రపంచయుద్ధం అనంతరం భారత్లో జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ల రాజకీయ ఎదుగుదలకు నేతాజీ వల్ల ముప్పు ఉన్నది, ఈ నేపథ్యంలో నేతాజీ దస్త్రాల్లో వర్గీకరించిన కొన్నింటికి చాలా ప్రాధాన్యముందని ఆయన అన్నారు.