బ్రస్సెల్స్ ఎయిర్పోర్టులో జంట పేలుళ్లు: 28మంది మృతి
బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో జావెంటమ్ అంతర్జాతీయ విమానాశ్రయం మంగళవారం రెండు భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. విమానాశ్రయంలోని డిపార్చర్ హాల్లో అమెరికా ఎయిర్లైన్స్ డెస్క్ సమీపంలో జంట పేలుళ్లు సంభవించాయి.
దీంతో అత్యవసర ద్వారం ద్వారా విమానాశ్రయం నుంచి ప్రయాణికులను బయటకు పంపివేస్తున్నారు. ఈ ఘటనలో 28 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు.
బెల్జియం రాజధాని బ్రస్సెల్ విమానాశ్రయంలో బాంబు దాడులతో దద్దరిల్లిన నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్ పోర్టులోని వారంతా భయాందోళనలతో కేకలు వేస్తూ బయటకు పరుగులు పెట్టారు. విమానాశ్రయాన్ని మూసివేశారు. విమానాశ్రయం నుంచి దట్టమైన పొగ వెలువడుతోంది.
జంట పేలుళ్ల అనంతరం దుండగులు కాల్పులకు పాల్పడినట్లుగా కూడా తెలుస్తోంది. పేలుళ్లు జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
బ్రస్సెల్ మెట్రో స్టేషన్లో మరో పేలుడు
బ్రస్సెల్ మెట్రో స్టేషన్లో మరో పేలుడు సంభవించింది. ఎయిర్ పోర్టులో పేలుడు సంభవించిన అనంతరం కొద్ది సేపటికి మెట్రో స్టేషన్లో పేలుడు సంభవించింది. మెట్రో స్టేషన్లో పేలుడులో ఎవరైనా గాయపడ్డారా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో భారతీయులెవరికీ గాయాలు కాలేదు. ఈ పేలుళ్లు ఐఎస్ ఉగ్రవాదుల పనిగా నిర్ధారించారు.
పారిస్ దాడిలో నిందితుడిగా ఉన్న సల్లాహ్ అబ్దెస్లామ్ని బ్రస్సెల్స్లో గత శుక్రవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టుతో అక్కడ హైఅలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పేలుళ్లు జరగడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఇది ఉగ్రవాదుల పనేనని విమానాశ్రయ వర్గాలు భావిస్తున్నాయి.