క్రిస్మస్ వేడుకల్లో నరమేథం: ఉగ్రదాడి: తిప్పి కొట్టిన సైన్యం: 115 మంది మృతి
ఒవువాడౌగు: పశ్చిమాఫ్రికాలో ఉగ్రవాదులు నరమేథాన్ని సృష్టించారు.ఆత్మాహూతి దాడికి తెగబడ్డారు. కరుణామయుడు ఏసుక్రీస్తు జయంతి రోజు క్రిస్మస్ వేడుకలు కొనసాగుతున్న సమయంలో జిహాదీలు ఆత్మాహూతి దాడికి పాల్పడ్డారు. జిహాదీల దాడిలో 35 మంది మరణించారు. అనంతరం సైనిక బలగాలు నిర్వహించిన కాల్పుల్లో ఏకంగా 80 మందికి పైగా జిహాదీలు మృతిచెందారు. పశ్చిమాఫ్రికాలోని బుర్కినా ఫాసో రాజధానిలో స్థానిక కాలమానం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
బుర్కినా ఫాసో అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోర్ ఈ విషయాన్ని వెల్లడించారు. బుర్కినా ఫాసో-మాలి దేశాల సరిహద్దు పట్టణం అర్బిండాలో స్థానికులు ఏర్పాటు చేసిన క్రిస్మస్ ఈవ్ వేడుకలను లక్ష్యంగా చేసుకుని జిహాదీలు దాడి చేశారు. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 35 మంది స్థానికులు మృత్యువాత పడ్డారు. వారిలో మహిళలు, చిన్నపిల్లలు అధికంగా ఉన్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జవాన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
జిహాదీలపై ఎదురు దాడి చేశారు. జవాన్ల కాల్పుల్లో 80 మందికి పైగా జిహాదీలు మరణించారని క్రిస్టియన్ కబోర్ వెల్లడించారు. జవాన్లు వీరోచితంగా పోరాడారని, 80 మంది జిహాదీలను మట్టుబెట్టారని ఆయన తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపారు. జిహాదీ గ్రూపులు మరిన్ని ఉన్నట్లు సమాచారం ఉందని, అర్బిండాలో అన్ని చోట్లా వాటి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. క్రిస్మస్ వేడుకల ఆరంభ సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు.