13మంది పిల్లలకు చిత్రహింస: ఆ పైశాచిక దంపతులకు 94ఏళ్ల జైలు!
Recommended Video
క్యాలిఫోర్నియా: కన్న బిడ్డలనే అత్యంత దారుణంగా గొలుసులతో బంధించి చిత్రహింసలకు గురిచేసిన అమెరికాలోని కాలిఫోర్నియా దంపతులకు కఠిన శిక్షనే అమలయ్యే అవకాశాలున్నాయి. ఏకంగా ఆ దంపతులకు 94 ఏళ్లపై పైగా జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు న్యాయవాదులు చెబుతున్నారు.
దారుణం: గొలుసులతో కట్టేసి, తిండిపెట్టక పిల్లలకు తల్లిదండ్రుల చిత్రహింసలు
ఆహారం సరిగా పెట్టకుండా 13 మంది కన్న బిడ్డల్ని చిత్రవధ చేసిన డేవిడ్ ఎలెన్ టూర్పిన్, లూయిస్ అన్నాను అక్కడి పోలీసులు గురువారం న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టారు. అయితే, సొంత పిల్లల్ని అత్యంత దారుణంగా గొలుసులతో బంధించి, చిత్రహింసలకు గురి చేయడానికి గల కారణాలను మాత్రం ఆ పైశాచిక దంపతులు చెప్పడం లేదు.
అంతేగాక, తమకేమీ తెలియదనీ, అమాయకులమనీ అంటున్నారు. వారిపై పోలీసులు హింస, చిన్నారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి అభియోగాలను నమోదు చేశారు. ఈ కేసుల్లో ఆ దంపతులు దోషులుగా తేలితే.. ఒక్కొక్కరికి 94 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
కనీసం చిన్నారులను బాత్రూంకి కూడా వెళ్లనీయకుండా ఆ తల్లిదండ్రులు దారుణంగా ప్రవర్తించారని అధికారులు చెప్పారు. 'స్నానం చేయనీయకుండా ఏడాది పాటు అలాగే ఉంచారని, వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది' అని చిన్నారులను పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఇటీవలే వెలుగుచూసిన ఈ దారుణం అమెరికాలో కలకలం రేపింది. 13 మంది పిల్లలో ఒకరైన ఓ 17 ఏళ్ల బాలిక తప్పించుకొని క్యాలిఫోర్నియా పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో అసలు విషయం బయటకు వచ్చింది.