కాలిఫోర్నియాలో భీతావహం: ఎమర్జెన్సీ: ఐసీయూ బెడ్స్ ఫుల్: స్టే అట్ హోమ్ ఆదేశాలు జారీ
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియాలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. భీతావహ వాతావరణం నెలకొంది. రోజురోజుకూ కరోనా వైరస్ తీవ్రత కట్టు తప్పుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అంచనాలకు మించిన స్థాయిలో పెరుగుతున్నాయి. కాలిఫోర్నియాలోని అనేక ప్రాంతాల్లోని ఆసుపత్రులకు పేషెంట్ల తాకిడి అధికమైంది. వందలాది మంది పేషెంట్లు బారులు తీరి నిల్చుంటున్నారు. కొత్త కేసులు విపరీతంగా పుట్టుకుని వస్తుండటంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు నిండిపోయాయి..బెడ్స్ దొరకని పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అనేక ప్రాంతాల్లో స్టే అట్ హెమ్ ఆదేశాలను జారీ చేశారు.
Recommended Video
ప్రస్తుతం అమెరికాలో కోటిన్నర వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1,49,83,425 కేసులు అక్కడ వెలుగులోకి వచ్చాయి. 2,87,825 మంది కరోనా బారిన పడి మరణించారు. ఇందులో కాలిఫోర్నియాలో నమోదైన కేసుల సంఖ్య 13 లక్షల పైమాటే. మొత్తం 13,40,716 కేసులు ఒక్క కాలిఫోర్నియాలోనే నమోదు అయ్యాయి. 19,879 మంది మరణించారు. అమెరికాలోని అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఈ స్టేట్ రెండో స్థానంలో ఉంది.
లాస్ ఏంజిలిస్లో 4,39,408 కేసులు నమోదు అయ్యాయి. శాన్ బెర్నార్డినో-1,03,911, రివర్సైడ్-95,255, శాన్డియాగో-90,468 కేసులు వెలుగు చూశాయి. ఈ సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అక్కడి ఆసుపత్రుల్లో ఐసీయూ యూనిట్లు కరోనా సోకిన పేషెంట్లతో నిండిపోయాయి. కొత్త పేషెంట్లను చేర్చుకోవడానికి అవసరమైనన్ని పడకలు అందుబాటులో లేని దుస్థితిని కాలిఫోర్నియా ఎదుర్కొంటోంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అత్యవసర పరిస్థితిని విధించారు. ఎవరూ బయటికి రావొద్దని ఆదేశాలను జారీ చేశారు. ఈ మేరకు గవర్నర్ గవిన్ న్యూసొమ్ ఉత్తర్వులు ఇచ్చారు.
కాలిఫోర్నియా మొత్తం మీద ఉన్న ఐసీయు బెడ్స్ల్లో కేవలం 8.6 శాతం మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య మరింత వేగంగా క్షీణిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో డిశ్చార్జీల సంఖ్య భారీగా తగ్గిందని పేర్కొన్నారు. కొత్త పేషెంట్లను చేర్చుకోవడానికి అవసరమైనన్ని బెడ్స్ అందుబాటులో లేవని, ఫలితంగా- ఎవరూ బయట తిరగొద్దని సూచించారు. తప్పనిసరిగా బయట తిరగాల్సిన వారు మాస్కులను వినియోగించాలని, శానిటైజర్లను వెంట ఉంచుకోవాలని చెప్పారు.