అమెరికాలో మళ్లీ కాల్పుల మోత... ప్రార్థనా మందిరంలో యువకుడి ఫైరింగ్... ఒకరి మృతి.
కాలిఫోర్నియా : అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. కాలిఫోర్నియా పోవేలోని యూదుల ప్రార్థనా మందిరం సినగాగ్లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా... మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. గాయపడిన వారిలో ఒక మహిళ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
శ్రీలంకలో భద్రతా దళాల కాల్పులు...15 మంది మృతి, మృతుల్లో ముగ్గురు మిలిటెంట్లు
కాల్పులకు పాల్పడిన నిందితున్ని 19ఏళ్ల జాన్ ఎర్నెట్గా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి పారిపోతున్న అతన్ని వెంబడించి పట్టుకున్నారు. కాల్పులకు నిందితుడు నిషేధిత ఏఆర్ 15 తుపాకీ వాడినట్లు తెలుస్తోంది. జాతి విద్వేషం కారణంగానే దుండగుడు కాల్పులకు తెగబడినట్లు అనుమానిస్తున్నారు. జాన్ ఎర్నెట్గా కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ శాన్ మార్కోస్ విద్యార్థి అని పోలీసుల విచారణలో తేలింది. గత నెలలో శాండియాగోలోని మసీదుకు నిప్పు అంటించిన ఘటనతో నిందితునికి సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
కాల్పుల ఘటనపై స్పందించిన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులను ప్రశంసిస్తూ ట్రంప్ ట్వీట్ చేశారు.