అమెరికా కొత్త అధ్యక్షుడిపై అదే ఉత్కంఠ- పని మెదలుపెట్టేసిన బైడెన్-ఐరోపా నేతలతో చర్చలు...
అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత ఎవరో స్పష్టంగా తేలకపోయినా ఇప్పటికే మెజారిటీ సాధించిన డెమోక్రాట్ అభ్యర్ధి జో బైడెన్ తన పని ప్రారంభించేశారు. ఇప్పటికే ఆయనతో టచ్లో ఉన్న అధికార మార్పిడి టీమ్ సాయంతో ఆయన విదేశాలతో చర్చలు ప్రారంభించేశారు. తాజాగా నిన్న ఆయన తనను అభినందించిన యూరోపియన్ దేశాల అధినేతలతో ట్రాన్స్ అట్లాంటిక్ సంబంధాలపై చర్చించినట్లు అధికార మార్పిడి టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయేల్ మ్యాక్రాన్తో పాటు పలువురు నేతలతో బైడెన్ తాజాగా చర్చలు జరిపారు. ప్రాన్స్ అధినేత మ్యాక్రాన్తో ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ, నాటో, ఈయూ సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. అలాగే మానవహక్కులు, కరోనాపై పోరు, వాతావరణ మార్పులు, ఇరాన్ అణు కార్యక్రమంపైనా మ్యాక్రాన్తో బైడెన్ చర్చించారు. ఉక్రెయిన్, సిరియా మధ్య పోరుపైనా ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు.
జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్తో మాట్లాడిన బైడెన్ ఆమె నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. ఈయూతో కలిసి ఉమ్మడి అజెండా రూపకల్పనపైనా మెర్కెల్తో బైడెన్ చర్చించారు. ఇమ్మిగ్రేషన్, పన్నులు, నాటో వంటి అంశాల్లో ట్రంప్తో విభేదించిన మెర్కెల్తో బైడెన్ చర్చలు జరపడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఐర్లాండ్ అధినేత మైకేల్ మార్టిన్తో సైతం బైడెన్ పలు అంశాలపై చర్చించారు. ఐర్లాండ్తో గుడ్ఫ్రైడే ఒప్పందం అమలు చేస్తామని ఈ సందర్భంగా బైడెన్ ఆయనకు హామీ ఇచ్చారు.
Recommended Video
అలాగే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్తో వచ్చే ఏడాది జరిగే జీ7 సదస్సు, ఐరాస వాతావరణ మార్పుల సదస్సులపై బైడెన్ చర్చించారు. వీటితో పాటు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపైనా బైడెన్-జాన్సన్ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జాన్సన్ స్వయంగా ఆయన ట్విట్టర్ పేజ్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్కు జాన్సన్ అభినందనలు తెలిపారు.