మూతపడిన కేంబ్రిడ్జ్ అనలిటికా, విచారణ కొనసాగుతుంది
లండన్: ఫేస్బుక్ను చిక్కుల్లో పడేసిన రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా మూతపడింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ కోసం పని చేసిన ఈ సంస్థ ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారాన్ని దొంగిలించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇది కలకలం రేపింది.
అయితే, తమ సంస్థను మూసివేస్తున్నట్లు కంపెనీ బుధవారం ప్రకటించింది. అమెరికా, బ్రిటన్లలో కంపెనీలు దివాలా తీసినట్లు వెల్లడించారు. ఫేస్బుక్ వివాదం వల్ల వినియోగదారులను కోల్పోయామని, కంపెనీని కొనసాగించే పరిస్థితి లేదన్నారు.
కేంబ్రిడ్జ్ అనలిటికా మాతృసంస్థ ఎస్సీఎల్ ఎలక్షన్స్ కూడా దివాల్ తీసింది. ఇదిలా ఉండగా, సంస్థను మూసివేసినా ఫేస్బుక్ వివాదం నేపథ్యంలో దర్యాఫ్తు కొనసాగుతుందని బ్రిటన్ డేటా రెగ్యులేటర్ తెలిపింది. అన్ని అంశాలను దర్యాఫ్తు చేస్తామని వెల్లడించింది. ఫేస్బుక్ నుంచి అక్రమంగా దాదాపు 87 మిలియన్ల మంది ఖాతాదారుల సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా ఉపయోగించుకుందని ఆరోపణలు ఉన్నాయి.