కాఫీ టేబుల్ సదస్సులో ఒబామా, పుతిన్ భేటీ
న్యూఢిల్లీ: జీ20 సదస్సులో భాగంగా ఆదివారం అంటాల్యాలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ భేటీ అయ్యారు. సిరియాలో రష్యా వైమానిక దాడుల తర్వాత వీరిద్దరూ భేటీ కావడం ఇదే తొలిసారి.
టర్కీలోని అంటాల్యాలో జీ20 సదస్సుకు వచ్చిన ఒబామా, పుతిన్లు కాఫీ టేబుల్ సదస్సులో సమావేశమయ్యారు. వీరితో పాటు అమెరికా జాతీయ భద్రతా ఉపసలహాదారు బెన్ రోడ్స్ కూడా పాల్గొన్నారు. వీరిద్దరి భేటీ దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగిందని రష్యా మీడియా తెలిపింది.
అయితే, వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్న అంశాలు మాత్రం బయటకు రాలేదు. సిరియాలో ఉగ్రమూకలను అణిచివేతకు ఫ్రాన్స్తో మిలటరీ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని అమెరికా నిర్ణయించింది. పారిస్పై ఐసిస్ దాడితో ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు.
నిఘా సమాచారాన్ని పంచుకోవడం, సైనిక సహకారంలో ఫ్రాన్స్తో కలిసి ముందుకు సాగుతామని అమెరికా జాతీయ భద్రతా ఉపసలహాదారు బెన్ రోడ్స్ చెప్పారు. ఇరాక్, సిరియాల్లో సంయుక్త ఆపరేషన్లను తీవ్రతరం చేస్తామని ఆయన తెలిపారు. కాగా, అమెరికా, నాటో, ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఐసీ)లు కలిసి ఐసీస్ ఉగ్రవాదులను అంతమొందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారుతో సమావేశమయ్యారు. ప్రస్తుతమైతే అమెరికాకు ఎలాంటి ఉగ్రముప్పు లేదని నిఘావర్గాలు వివరించినట్లు వైట్హౌస్ ప్రతినిధి తెలిపారు. ఇక, ఐఎస్ను తుదముట్టించాలన్న లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇరాక్ బలగాలు, సిరియాలోని ఐసిస్ వ్యతిరేక పోరాటదారులతో అమెరికా సైనిక సలహాదారులు మరింత చేరువగా పనిచేయడం లాంటివి చేస్తారని అంటున్నారు. ఐసిస్ మూకను నియంత్రించడం కాదని, ఓడించి.. నిర్మూలించాలని అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యానించారు. ఇస్లాంపై అమెరికా యుద్ధం చేయబోదని, కేవలం ఉగ్రవాదంపై మాత్రమే పోరుతుందని ఆమె స్పష్టం చేశారు.