చరిత్రను కూల్చొద్దు: జిన్నా ఇంటిపై భారత్కు ఇమ్రాన్ ఖాన్
కరాచీ: చరిత్రను కూల్చే ప్రయత్నాలు చేయవద్దని మాజీ క్రికెటర్, పిటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ముంబైలోని మహ్మద్ అలీ జిన్నా ఇంటిని కూల్చి వేయాలంటూ వస్తున్న వాదనలపై ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
జిన్నా ఇంటిని కూల్చేయాలని భారత రాజకీయనాయకులు చెప్పడం దురదృష్టకరమన్నారు. భవనాలను కూల్చివేసి చరిత్రకు వాటిని దూరం చేయకూడదన్నారు. ఇమ్రాన్ ఖాన్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్
ముంబైలోని జిన్నా ఇల్లు దేశ విభజనకు చిహ్నమని, దానిని వెంటనే కూల్చి వేయాలని ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే మంగల్ లోధా డిమాండ్ చేశారు. ఆ స్థలంలో మహారాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించేలా కల్చరల్ సెంటర్ను నిర్మించాలని కోరారు.
దక్షిణ ముంబైలో ఉన్న జిన్నా ప్యాలెస్ను కూల్చివేసి, సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీ చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో ముంబైలోని జిన్నా హౌస్ను ప్రభుత్వ ఆస్తి అన్నారు. దాని నిర్వహణకు ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు.
స్పందించిన పాకిస్తాన్
దీంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై స్పందించిన పాకిస్తాన్.. ఆ ఇంటిని తమ దేశానికి అప్పగించాలని భారత్ను కోరింది. జిన్నా ఇల్లు పాకిస్థాన్ చారిత్రక ఆస్తి అని, దానిని భారత్ గౌరవించడంతో పాటు భద్రపర్చాలని కోరింది.
తమ దేశ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా ఇంటిని తమకు అప్పగించాలని చెప్పింది. ముంబైలోని జిన్నా ఇంటిపై తమ ప్రభుత్వానికి ఉన్న యాజమాన్య హక్కును భారత సర్కారు గౌరవించాలని విజ్ఞప్తి చేసింది.
మా ఆస్తి.. పాకిస్తాన్
ఆ ఇంటిని భారత ప్రభుత్వం పరిరక్షిస్తుందన్న నమ్మకాన్ని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా వ్యక్తం చేశారు. ముంబైలో ఉన్న జిన్నా ఇల్లు తమ దేశ ఆస్తి అన్నారు. పాకిస్తాన్ కు అప్పగిస్తామని చాలా సందర్భాలలో భారత్ హామీ ఇచ్చిందని, ఇప్పటి వరకు మాట నిలబెట్టుకోలేదని జకారియా వ్యాఖ్యానించారు.
2.5 ఎకరాల్లో ఇల్లు.. వాదనలు
కాగా, 2.5 ఎకరాల స్థలంలో ఉన్న జిన్నా ఇంటి విలువ దాదాపు 400 మిలియన్ డాలర్లు ఉంటుంది. ఈ ఇంటిపై చాలాకాలంగా జిన్నా కుమార్తె, భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాల మధ్య వాదనలు నడుస్తున్నాయి.