గృహ హింస: 8మంది కుటుంబసభ్యులను చంపి ఆత్మహత్య
ఒట్టావా: కెనడాలోని ఎడ్ మాంటన్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ ఒత్తిళ్లు తట్టుకోలేక నిరాశ నిస్పృహలకు గురైన ఓ వ్యక్తి.. 8మంది కుటుంబసభ్యులను కాల్చి చంపాడు. ఆ తర్వాత అదే తుపాకీతో తను కూడా కాల్చుకుని చనిపోయాడు.
నిందితుడి దగ్గర ఉన్న తుపాకీకి లైసెన్స్ ఉందని.. అయితే అది అతడు దొంగలించిందని పోలీసులు తెలిపారు. అల్బెర్టాలోని ఎడ్ మాంటన్లోని అతని ఇంట్లో ఏడు మృతదేహాలను గుర్తించినట్లు పోలీస్ అధికారి రాడ్ నెచ్ తెలిపారు. మరో రెండు ప్రాంతాల్లో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయని చెప్పారు.
అందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఇదొక విషాదకరమైన ఘటన అని చెప్పారు. ఓ తెలివితక్కువ వ్యక్తి వల్ల ఈ మరణాలు జరిగాయని అన్నారు. ఇది విషాదకరమైన రోజని తెలిపారు. 1956 తర్వాత ఇంతటి దారుణం జరగడం ఇదే తొలిసారని చెప్పారు.
కుటుంబకలాహాలు, గృహహింస కారణంగానే ఈ హత్యలు జరిగి ఉంటాయని తెలిపారు. హత్యకు గురైన వారిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు, మరో ఇద్దరు చిన్నారులు ఉన్నారని చెప్పారు. నిందితుడు ముందే నిర్ణయించుకుని ఈ హత్యలకు పాల్పడి ఉంటాడని ఆయన తెలిపారు.