కారు బాంబు పేలుడు: 9మంది సైనికులు మృతి
ఇస్తాంబుల్: టర్కీలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉగ్రవాదులు కారుబాంబు పేల్చడంతో తొమ్మిది మంది సైనికులు మరణించారు. నిఘావర్గాల సమాచారం ప్రకారం.. టర్కీకి ఆగ్నేయ సరిహద్దులో ఉన్న పోలీస్స్టేషన్లో ఈ పేలుడు సంభవించింది.
సెమ్డిన్లి నగరానికి సమీపంలోని డ్యూరాక్ జండ్మండరీ స్టేషన్లో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఈ ప్రాంతం ఇరాక్, ఇరాన్లకు సరిహద్దులో ఉంది. కుర్దిస్టన్ వర్కర్స్ పార్టీ(పీకేకే) ఉగ్రవాదులు ఈ సరిహద్దులో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
వాహన తనీఖీలు నిర్వహిస్తున్న సమయంలో పేలుడు సంభవించినట్లు ఓ న్యూస్ఏజెన్సీ పేర్కొంది. పలు ఉగ్రవాద సంస్థల ప్రోత్సాహంతో 1984లో పీకేకే ఏర్పాటైంది.
కాలిఫోర్నియాలో కాల్పులు
అమెరికా: కాలిఫోర్నియాలోని పామ్ స్ప్రింగ్స్ నగరం శనివారం కాల్పులతో దద్దరిల్లింది. నగర పోలీసులు ఓ కుటుంబ వివాదం కేసుపై ఓ వ్యక్తితో మాట్లాడుతుండగా అతను ఒక్కసారిగా తుపాకీతో పోలీసులుపై కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
అఫ్గాన్లో కూలిన ఆర్మీ హెలికాప్టర్
అఫ్గనిస్థాన్లోని ఉత్తర బాగ్లన్ ప్రావిన్స్లో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో 8మంది అఫ్గాన్ సైనికులు మృతి చెందారు. ఆర్మీ ఆయుధాలు తరలిస్తున్న హెలికాప్టర్ దండ్గోరీ జిల్లాలో ప్రయాణిస్తుండగా సాంకేతికలోపం కారణంగా కూలిపోయిందని అధికారులు తెలిపారు. కాగా, హెలికాప్టర్ను తామే కూల్చేశామని తాలిబన్ జబీహుల్లా ముజాహిద్ ప్రకటించింది.
జెరూసలెంలో ఆగంతుకుడి కాల్పులు
జెరూసలెంలో ఆదివారం ఓ ఆగంతుకుడు కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆ దుండగుడిని కాల్చి చంపేశారు. గాయపడిన ముగ్గురులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దాడి జరిగిన ప్రదేశం పోలీసుల ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉంది.