ఐఎస్ఐఎస్ కారు బాంబు పేలుడు: 100 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రద్దిగా ఉన్న మార్కెట్ ప్రాంతంలో కారు బాంబు పేలుడు సంభవించి 100 మందికి పైగా మరణించారు. అనేక మందికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.
బాగ్దాద్ లోని ఖాన్ బని సాద్ మార్కెట్ ప్రాంతం నిత్యం రద్దిగా ఉంటుంది. రంజాన్ పండుగ సందర్బంగా శుక్రవారం ఇంకా ఎక్కువ రద్దిగా ఉంది. ఆ సందర్బంలో పండుగకు కావలసిన వస్తువులు తీసుకుంటు ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు.
అదే సమయంలో ఒక్క సారిగా కారులో దూసుకు వెళ్లిన వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ బాంబు పేలుడుతో అదే ప్రాంతంలో సరుకులు తీసుకుంటున్న వారు దుర్మరణం చెందారు. శవాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అనేక మంది అవయవాలు గాలిలో ఎగిరాయి. ఏమి జరుగుతుందో తెలియక స్థానికులు హడలిపోయారు.
ఈ బాంబు పేలుడు కారణంగా సంఘటనా స్థలంలో 80 మంది దుర్మరణం చెందారు. తీవ్రగాయాలైన 60 మందిని ఆసుపత్రికి తరలించారు. వారిలో 20 మంది మరణించారు. మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు, ట్విట్టర్ లో వారే పోస్ట్ చేశారు.