ప్యారిస్: డైలమా, ఉగ్రవాదుల కోసం 5 హెలికాప్టర్లు, వేలాది పోలీసులు
ప్యారిస్: ప్యారిస్లో ఉగ్రవాదులను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉగ్రవాదులు ఈశాన్య ఫ్రాన్సులోని డమార్టన్ ఎస్ గోయిల్ పట్టణంలో ఓ ప్రింటింగ్ ప్రెస్ గోదాములో దాక్కున్నారు. వారితో సంప్రదింపులు జరుపుతూనే.. పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉగ్రవాదులు బందీలను అడ్డం పెట్టుకున్నారు. దీంతో పోలీసులకు ఏం చేయాలో తోచటం లేదు. ఉగ్రవాదులు ఉన్న గిడ్డంగి పైన హెలికాప్టర్ నిరంతరాయంగా తిరుగుతూ సమీక్షిస్తోంది. డమార్టన్ ఎస్ గోయల్ పట్టణాన్ని భద్రతా దళాలు పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి.
పట్టణంలో రాకపోకలు నిషేధించారు. ప్రజలు బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. ఈ ఆపరేషన్లో వేలాది మంది పోలీసులు పాల్గొంటున్నారు. ఐదు హెలికాప్టర్లు వినియోగిస్తున్నారు. ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు ప్యారిస్ నగరాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు.
పోలీసులు ఉగ్రవాదులు ఉన్న బిల్డింగును చుట్టుముట్టారు. శుక్రవారం నాడు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఎవరు కూడా మృతి చెందలేదని ఫ్రాన్స్ అధికారులు చెప్పారు. ఉదయం ఒకరి మృతి చెందినట్లు మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు.
కోషేర్ సూపర్ మార్కెట్ వద్ద కాల్పులు
కేషెర్ సూపర్ మార్కెట్ వద్ద కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు యెమెన్లో శిక్షణ పొందినట్లుగా అనుమానిస్తున్నారు.