చిన్నప్పుడే జాతి విముక్తిపై కార్ల్స్ ఫ్యూగ్ డిమాంట్ కల: జర్నలిస్టు నుంచి జాతీయోద్యమ నేత
కేటలోనియా విముక్తి ఉద్యమ నాయకుడు కార్ల్స్ ప్యూగ్డిమాంట్ గతంలో పాత్రికేయునిగా పనిచేశారు. అంచెలంచెలుగా ఎదిగి ఎడిటర్ స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత తన ప్రాంత విముక్తి కోసం భారత జాతిపిత ‘మహాత్మాగాంధీ’ అ
బార్సిలోనా: కేటలోనియా విముక్తి ఉద్యమ నాయకుడు కార్ల్స్ ప్యూగ్డిమాంట్ గతంలో పాత్రికేయునిగా పనిచేశారు. అంచెలంచెలుగా ఎదిగి ఎడిటర్ స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత తన ప్రాంత విముక్తి కోసం భారత జాతిపిత 'మహాత్మాగాంధీ' అడుగు జాడల్లో అహింసాత్మక ఉద్యమాన్ని ప్రారంభించారు. కార్ల్స్ చిన్ననాటి నుంచే తమ ప్రాంత స్వేచ్ఛ కోసం కలలుగన్నారు. అందుకోసం అవసరమైతే జైలుకు కూడా వెళ్లడానికి సిద్ధమేనని ప్రకటించారు. రెండు రోజుల క్రితం జరిగిన కేటలోన్ పార్లమెంట్ సమావేశంలో 135 మంది సభ్యుల్లో 70 మంది అనుకూలంగా ఓటు వేయడంతో కేటలోనియాను రిపబ్లిక్గా ప్రకటించారు. కానీ స్పెయిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారని ఆరోపిస్తూ కార్లెస్ ఫ్యూగ్ డిమాంట్, ఆయన మద్దతుదారులైన ఎంపీలపై అభియోగాలు నమోదు చేశారు.
స్పెయిన్ ప్రభుత్వం
స్పెయిన్ ప్రభుత్వం వెంటనే కేటలోనియా అధ్యక్ష పదవి నుంచి కార్ల్స్ను గద్దె దించి ఆయనపై తిరుగుబాటు అభియోగాలు మోపింది. కానీ స్పెయిన్ ప్రభుత్వం, కోర్టులు అనుమతినివ్వకున్నా కార్ల్స్ ఫ్యూగ్ డిమాంట్.. కేటలోనియా స్వాతంత్య్రం కోసం ఈ నెల ఒకటో తేదీన రెఫరెండం నిర్వహించారు. ప్రభుత్వం, కోర్టులు నిషేధాజ్నలు విధించినా ఈ నెల ఒకటో తేదీన రిఫరెండం నిర్వహించిన తర్వాత వందల కంపెనీలు కేటలోనియా ప్రాంతం నుంచి వెళ్లిపోయాయి. గత ఏడాది జనవరిలో వేర్పాటువాద పార్టీలకు నాయకునిగా ఎన్నికైన కార్ల్స్ వెంటనే స్వాతంత్య్రోద్యమాన్ని ప్రారంభించారు. 2001 నుంచి గిరోనా మేయర్గా ఉన్న కార్ల్స్ కేటలోన్ అధ్యక్ష పదవిని చేపట్టగానే స్పెయిన్కు నంబర్ వన్ శత్రువుగా మారారు.
కేటలోనియన్
కాగా, కేటలోనియన్ ప్రాంత సమస్యల పరిష్కారం, వాటిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు కార్లెస్ కార్ల్స్ ఫ్యూగ్ డిమాంట్ తొలుత ఒక వార్తా సంస్థ, తర్వాత 1982లో ఆంగ్ల దినపత్రిక ప్రకటించారు. కేటలోనియ్లలో ఆత్మగౌరవాన్ని ప్రోత్సహించారు. కేటలోనియా స్వాతంత్ర్యోద్యమ మున్సిపాలిటీల సంఘం అధ్యక్షుడిగానూ పని చేశారు. 1991లో యుగొస్లోవేయా నుంచి విడివడిన స్లావేనియాలో పర్యటించి.. అక్కడ స్వాతంత్రోద్యమం గురించి తెలుసుకున్నారు. రిఫరెండం ద్వారా స్లావేనియా విడివడిన సంగతి తెలిసిందే. అప్పట్లో కేటలోనియా ఉద్యమకారుల బలం తక్కువగానే ఉన్నది. సోషల్ మీడియాతో అనుబంధం పెంచుకున్న కార్ల్స్ ఫ్యూగ్ డిమాంట్.. ఫ్రెంచ్, ఇంగ్లిష్, రొమేనియా భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. గతేడాది జనవరిలో కేటలోనియా రీజియన్ పార్లమెంట్లో సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించిన ప్యూగ్ డిమాంట్.. తన ప్రాంతానికి స్వాతంత్ర్య సాధనకు అవసరమైన మెజారిటీ సీట్లు పొందారు. అంతకుముందు ఆయన 2001 నుంచి గిరోనా నగర మేయర్గా ఎన్నికయ్యారు. తర్వాత కేటలోనియా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గతేడాది ఆర్టూర్ మాస్ స్థానే కేటలోనియాప్రాంతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన ప్యూగ్ డిమాంట్ 2200 మంది జనాభా గల మారుమూల పల్లెటూరులో జన్మించారు.
ఇలా స్పెయిన్ ఆధీనంలోకి కాటలోనియా
స్వాతంత్య్రం ప్రకటించుకున్న కేటలోనియాను స్పెయిన్ తన నియంత్రణలోకి తీసుకున్నది. ఆ ప్రాంత పోలీస్ అధికారిపై వేటు వేసింది. కేటలన్ ప్రాంతీయ పార్లమెంట్ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్న మరుసటి రోజే స్పెయిన్ ఆ ప్రాంతంలో చర్యలు ప్రారంభించింది. కేటలోనియా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, మంత్రులతోపాటు మొత్తం పార్లమెంట్ను రద్దు చేసిన స్పెయిన్ ప్రభుత్వం శనివారం ఆ ప్రాంత అత్యున్నత పోలీస్ అధికారి లూయిస్ ట్రపేరోను డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల ఒకటో తేదీన కేటలోనియా స్వాతంత్య్రంపై నిర్వహించిన రెఫరెండాన్ని ట్రపేరో అడ్డుకోలేకపోయారని, అందువల్లే అతనిపై వేటుపడిందని అధికారులు పేర్కొన్నారు. వేర్పాటు వాదులకు సహకరిస్తున్నారని ట్రపేరోపై విమర్శలు ఉన్నాయి. కేటలోనియాలో జాతీయ ప్రభుత్వం పట్ల అవిధేయత పెరిగిందని, అందువల్ల ఆ ప్రాంతంలో డిసెంబర్ 21న తాజాగా ఎన్నికలు నిర్వహించనున్నామని స్పెయిన్ ప్రధాని మరియానో రజోయ్ చెప్పారు.
తాత్కాలిక ప్రభుత్వానికి స్పెయిన్ విదేశాంగశాఖ కార్యదర్శుల సారథ్యం
తనను తాను కేటలోనియాకు అధ్యక్షుడిగా ప్రకటించుకున్న కార్ల్స్ ప్యూగ్డిమాంట్ అతని అనుచరులు ఇప్పుడు స్వచ్ఛందంగా తప్పుకుంటారా లేదా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్పెయిన్ విదేశాంగ శాఖ కార్యదర్శులు కేటలోనియా ప్రాంతీయ మంత్రిమండలి బాధ్యతలు చేపట్టనున్నారు. కాటలోనియా ప్రాంతీయ మంత్రుల స్థానంలో బాధ్యతలు తీసుకోనున్న వారితో స్పెయిన్ ఉపప్రధానమంత్రి సొరయ సాయెంజ్ డి శాంటమారియా సమావేశం కానున్నారు. కేటలోనియాపై ప్రత్యక్ష పాలనను విధించిన స్పెయిన్ ప్రభుత్వంపై ప్రజాస్వామ్యయుతంగా పోరాడుదామని విముక్తి ఉద్యమ నేత, ఆ ప్రాంత మాజీ అధ్యక్షుడు కార్ల్స్ ప్యూగ్డిమాంట్ పిలుపునిచ్చారు. ఇంతకాలం పోరాడి సాధించినదానిని కాపాడుకొనేందుకు ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలని పేర్కొన్నారు. కేటలోనియా స్వాతంత్య్ర ప్రకటన వెలువడగానే బార్సిలోనా సహా పలు కేటలన్ నగరాల్లో వేల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబురాలు చేసుకున్నారు.
చాలా కాలం తర్వాత కేటలోనియా స్వయంప్రతిపత్తికి కోత
స్వాతంత్య్ర ప్రకటన నేపథ్యంలో బార్సిలోనా సహా పలు కాటలోనియా ప్రాంత నగరాల్లో వేలమంది గుమిగూడి సంబరాలు జరుపుకున్నా, పాలనకు చట్టబద్ధ అధికారాలు లేవని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే స్పెయిన్ ప్రభుత్వం వెంటనే స్పందించి వారి స్వాతంత్య్రాన్ని రద్దు చేయడంపై 75 లక్షల మంది కేటలోనియన్లు మండిపడుతున్నారు. విద్య, ఆరోగ్య రంగం, పోలీసు వ్యవస్థపై కేటలోనియాకు ఉన్న స్వయంప్రతిపత్తి అధికారాలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. కాటలోనియా ప్రాంత స్వయంప్రతిపత్తి అధికారాలపై కేంద్ర ప్రభుత్వం కోతపెట్టడం చాలా ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అయితే ఈ తరహా చర్యల్ని నిరోధిస్తామంటూ స్వాతంత్య్ర మద్దతుదారులు హెచ్చరించారు. స్పెయిన్లో ఏర్పడిన కేటలోనియా సంక్షోభం హింసాత్మకంగా మారవచ్చని ఐరోపా విశ్లేషకుడు ఫెడరికో సాంటీ హెచ్చరించారు.