పొల్యూషన్ ఎఫెక్ట్ : ప్రతి ఆదివారం ఆ నగరంలో రోడ్డుపైకి కార్లు నిషేధం
పారిస్ : వాతావరణం పై దృష్టి సారించింది ఫ్రాన్స్ ప్రభుత్వం. ఇందులో భాగంగా రాజధాని నగరమైన పారిస్ నగరంపై కాన్సన్ట్రేట్ చేసింది. పర్యాటక ప్రాంతం కూడా కావడంతో అక్కడ కాలుష్య నియంత్రణపై ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం ఇకపై రోడ్లపైకి కార్లు తిరగడంపై నిషేధం విధించింది. ఇది కాలుష్య నియంత్రణ కోసమే అని ప్రభుత్వం వెల్లడించింది. అక్టోబర్ ఏడు నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు పేర్కొంది.
ఇప్పటికే ప్రతిఏటా ఒకరోజు కార్లను రోడ్లపై తిప్పకుండా ఉండే నిబంధన పారిస్లో ఉంది. అయితే పాశ్చాత్య యూరప్లో అత్యంత కాలుష్య నగరంగా రికార్డులకెక్కింది పారిస్ నగరం. జర్మనీలోని ఉప్పెర్టల్ ఇన్స్టిట్యూట్ కాలుష్య నగరాలపై సర్వే నిర్వహించగా అత్యంత కాలుష్య నగరంగా పాశ్చాత్య యూరప్లో పారిస్ నగరమే అని పేర్కొంది. ఇక్కడ పీల్చుకునేందుకు స్వచ్ఛమైన గాలి దొరకదని సర్వేలో తేలింది. మొత్తం 13 ప్రధాన నగరాలపై సర్వే నిర్వహించగా మాస్కో అత్యధికంగా కాలుష్య కోరల్లో చిక్కుకుందని సర్వే వెల్లడించింది.
కొత్తగా పారిస్లో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6గంటలవరకు కార్లను రోడ్లపైకి వచ్చేందుకు నిషేధం విధించారు. దీంతో పాదాచారులు, బైకులు నడిపే వాహనదారులు స్వేచ్ఛగా విహరించే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిటికి మాత్రం మినహాయింపు ఇచ్చింది ఫ్రాన్స్ సర్కార్. అందులో డెలివరీ వ్యాన్లు, ట్యాక్సీలకు కొన్ని షరతులతో మినహాయింపు ఇచ్చారు.
ఈ వాహనాలు ప్రభుత్వం సూచించిన రూట్లోనే వెళ్లాల్సి ఉండటంతో పాటు 20 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువగా వెళ్లకూడదనే షరతు విధించారు. పారిస్ మేయర్ పారిస్ రిస్పైర్ అనే నినాదంతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వాయుకాలుష్యం అధికంగా ఉన్నచోట కార్లను నిషేధించారు.