ఎయిర్ పోర్ట్లో రాయబారిపై దాడి: సిసి కెమెరాల్లో.. (వీడియో)
కౌలాలంపూర్: కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీలంక రాయబారి ఇబ్రహీం సాహిబ్ అన్సార్ పైన దుండగులు దాడికి పాల్పడ్డారు. విమానాశ్రయంలో భద్రత ఉన్నప్పటికీ రాయబారి పైన దాడి జరగడం గమనార్హం. వెంటనే స్పందించిన పోలీసులు దుండగులను అదుపులోకి తీసుకున్నారు.
శ్రీలంక రాయబారి పైన జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. విమానాశ్రయంలో ఆయన నడుచుకుంటూ వెళ్తుండగా.. అకస్మాత్తుగా కొందరు అతని వద్దకు వచ్చి అడ్డుకున్నారు. వెంటనే అతని పైన పిడిగుద్దులు కురిపించారు.
అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని గుంపును చెదరగొట్టారు. ఈ సంఘటన ఆదివారం నాడు జరిగింది. ఈ ఘటనలో శ్రీలంక రాయబారి స్వల్పంగా గాయపడ్డారు. దాడికి పాల్పడిన ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే ఇబ్రహింపై వారు ఎందుకు దాడి చేశారనే విషయం తెలియాల్సి ఉంది. తమ రాయబారిపై దాడి చేయడంపై శ్రీలంక విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశ అధికారులకు రక్షణ కల్పించడంలో మలేసియా అధికారులు విఫలమయ్యారని పేర్కొంది.
ఘటనపై వెంటనే విచారణ జరిపించి, తమ దౌత్యబృందానికి భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. అంతకుముందు, శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద్రా రాజపక్సే మలేసియా వెళ్లిన సందర్భంలోనూ వందల మంది నిరసనకారులు కౌలాలంపూర్లో ఆందోళన చేపట్టారు.