పాక్ విమాన ప్రమాదం: కూలక ముందు సీసీ కెమరాల్లో రికార్డు.. పైలట్ చివరి మాటలు కూడా..!
శుక్రవారం రోజున పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మరి కొన్ని నిమిషాల సమయంలో పీఐఏకు చెందిన ఏ-320 విమానం కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుందనగా నివాస ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడగా మొత్తం 99 మంది మృతి చెందారు. అయితే ఈ విమాన ప్రమాదంకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ ఒకటి వెలుగు చూసింది.
Recommended Video
విమాన ప్రమాదం సీసీ టీవీ ఫుటేజీ
లాహోర్ నుంచి 99 మంది ప్రయాణికులతో కరాచీకి బయలుదేరిన పీకే-8303 విమానం కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుందనగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన 97 మంది ప్రయాణికులేనా లేక నివాస ప్రాంతాల్లో నివసించే వారు కూడా ఉన్నారా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదని చెప్పారు. ఇక విమానం నివాస ప్రాంతాల్లో కూలకముందు ఓ ఇంటి పై ఉన్న సీసీ కెమెరాలో విమానం దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇక విమానం నివాస ప్రాంతంలో కూలడంతో అక్కడ భవనాలు భారీగా ధ్వంసమైనట్లు సింద్ ఆరోగ్యశాఖ మంత్రి అజ్ర పెచుహో చెప్పారు.
పైలట్ చివరి మాటలు ఉన్న ఆడియో
ఇదిలా ఉంటే ఈ విమానం ల్యాండ్ అయ్యేందుకు తొలి ప్రయత్నంలో విఫలం కాగా... తిరిగి రెండో ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీన్నే కోడ్ భాషలో గో ఎరౌండ్ అంటారు. ఇక చివరి నిమిషాల్లో విమానంలోని పైలట్ ఏటీసీతో మాట్లాడిన ఆడియో కూడా బయటకు వచ్చింది. రెండు ఇంజిన్లు కోల్పోయామంటూ ఏటీసీతో పైలట్ చెప్పిన సంభాషణలు కూడా అందులో వినిపిస్తున్నాయి. అదే సమయంలో విమానం అత్యంత ప్రమాద పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాడే కోడ్ భాష "మేడే మేడే మేడే " అని పైలట్ చెప్పడం కూడా వినిపించింది.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం
ఇక ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ముందుగా ఈ విమానం జిన్నా గార్డెన్ ప్రాంతంలోని మోడల్ కాలనీలో ఉన్న ఓ టెలిఫోన్ టవర్ను ఢీకొట్టిందని ఆ తర్వాత ఓ ఇంటిపై కూలిందని చెప్పారు. విమానం కూలడంతో అక్కడ పెద్ద అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పారు. ఇక ఈ ఘోర దుర్ఘటనలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. లాక్డౌన్ కారణంగా ఎయిర్పోర్టులకే పరిమితమైన విమానాలు పాక్ ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో తిరిగి ప్రారంభమైన వారంరోజులకే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకోవడం విశేషం. 7 డిసెంబర్ 2016 తర్వాత పాకిస్తాన్లో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదం ఇదే అని ఆ దేశ ప్రభుత్వం చెబుతోంది. 2016లో పీఐఏ ఏటీఆర్-42 విమానం చిత్రాల్ నుంచి ఇస్లామాబాదుకు వెళుతున్న సమయంలో కూలింది. ఈ ప్రమాదంలో 48 మంది ప్రాణాలు కోల్పోయారు.