కశ్మీర్ పై గుడ్ న్యూస్-తగ్గిన చొరబాట్లు-మరికొన్నాళ్లు పాక్ తో కాల్పుల విరమణ కొనసాగింపు ?
భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో కొనసాగుతున్న కాల్పుల విరమణ మరికొంతకాలం పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఒప్పందం అమల్లో ఉంది. త్వరలో శీతాకాలం రానున్నందున అప్పటివరకూ కాల్పుల విరమణ కొనసాగించవచ్చని తెలుస్తోంది. కానీ ఇప్పటికీ సరిహద్దుల్లో పాకిస్తాన్ రిక్రూట్ మెంట్లు కొనసాగిస్తుండటం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఏడాది కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాకముందు ఉల్లంఘనలు ఎక్కువగా ఉండేవి. కానీ ఫిబ్రవరిలో ఒప్పందం అమల్లోకి వచ్చాక మాత్రం ఉల్లంఘనలు బాగా తగ్గినట్లు సైనిక వర్గాలు చెప్తున్నాయి. ఫిబ్రవరి నుంచి కేవలం రెండు చొరబాట్లు మాత్రమే జరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాకిస్తాన్ వైపు నుంచి చొరబాట్లు భారీగా తగ్గడం, కాల్పుల విరమణ ఉల్లంఘనలు తగ్గడంతో విరమణను మరికొంతకాలం పొడిగించే అంశంపై సైన్యం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్మీ తాజా సమాచారం ప్రకారం, 2020 లో 4,645 కాల్పుల విమరణ ఉల్లంఘనలు చోటు చేసుకోగా.. 2019 లో 3,168, 2018 లో 1,629 లు ఉన్నాయి. ఈ ఏడాది విరమణ అమల్లోకి వచ్చిన ఫిబ్రవరి 25 నుంచి ఇప్పటివరకూ మాత్రం కేవలం 592 ఉల్లంఘనలు మాత్రమే జరిగినట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల్లో శీతాకాలం రానుండగా.. అధిక ఎత్తులో ఉన్న కనుమలు మంచుతో కప్పుకుంటాయి. దీంతో భూభాగం ద్వారా చొరబాట్లు జరిగే అవకాశాలు తగ్గిపోయాయి. ఈ లెక్కన చూస్తే గత కొన్నేళ్లుగా చూస్తే ఈ ఏడాది మాత్రం సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయని చెప్పవచ్చు.
ప్రస్తుతం కశ్మీర్ లోయలో 60-70 మంది విదేశీ ఉగ్రవాదులు మాత్రమే ఉన్నారని అంచనా వేస్తున్నారు. వీరంతా ప్రాథమికంగా పాకిస్థానీలని, వారి వ్యూహం తమపై దాడి చేయడమే కాదు, స్థానికులు ఏదో ఒక కార్యాచరణలో పాల్గొనాలని బలవంతం చేయడం కూడా అని అధికారులు చెప్తున్నారు. ఈ ఏాడాది ఆగస్టు చివరి నాటికి కాశ్మీర్లో 110 మంది ఉగ్రవాదుల్ని సైన్యం హతమార్చింది. జనవరిలో అత్యల్పంగా ముగ్గురు, జూలైలో అత్యధికంగా 33 మంది ఉన్నారు.