విక్రమ్ ల్యాండర్ ఫొటోలు ఇవిగో: చంద్రుడి ఉపరితలాన్ని జల్లెడ పట్టిన నాసా: అయినా నిరాశే!
న్యూయార్క్: చంద్రయాన్ 2 లో భాగంగా జాబిల్లిపైకి ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ పై ఇప్పటిదాకా ఉన్న ఏకైక ఆశ కూడా అడుగంటి పోయింది. విక్రమ్ ల్యాండర్ స్థితిగతులపై అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ఎలాగైనా ఆరా తీస్తుందని, సానుకూల సమాచారాన్ని ఇస్తుందని సగటు భారతీయుడు ఆశించినప్పటికీ.. దీనికి భిన్నమైన విషయాన్ని వెల్లడించారు నాసా శాస్త్రవేత్తలు. విక్రమ్ ల్యాండర్ ఆచూకీ తెలియట్లేదని ప్రకటించారు. చంద్రుడి ఉపరితలంపైకి దిగే సమయంలో విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండర్ అయి ఉంటుందని నిర్ధారించింది.
నిన్న రాయలసీమ..నేడు ఉత్తరాంధ్ర: ఉప్పొంగుతున్న నదులు!
దక్షిణధృవంపై జల్లెడ పట్టిన నాసా
చంద్రుడి దక్షిణధృవంపైకి ఇస్రో శాస్త్రవేత్తలు పంపించిన విక్రమ్ ల్యాండర్.. దిగినట్టుగా భావిస్తోన్న ప్రదేశం మొత్తాన్నీ జల్లెడ పట్టారు నాసా శాస్త్రవేత్తలు. దీనికోసం తమ లూనార్ రికాయిస్సెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ)ను ప్రయోగించారు. దాని దిశను సైతం మార్చి వేసి.. దక్షిణ ధృవం వైపు ప్రయాణించేలా చేశారు. విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయినట్టుగా చెబుతున్న ప్రాంతం ఉపరితలంపై ఆర్బిటర్ లో అమర్చిన కెమెరాల ద్వారా అన్ని కోణాల్లోనూ ఫొటోలు తీశారు. అయినప్పటికీ.. దాని జాడ దొరకలేదు. చిన్న ఆనవాళ్లు కూడా ఈ ఫొటోలో కనిపించలేదు. దీనితో విక్రమ్ ల్యాండర్.. క్రాష్ ల్యాండింగ్ లేదా హార్డ్ ల్యాండింగ్ అయి ఉంటుందని నిర్ధారించింది.
హైరిజల్యూషన్ కెమెరాలతో ఫొటోలు
ల్యాండర్.. ల్యాండ్ అయినట్లుగా అనుమానిస్తోన్న ప్రదేశానికి చెందిన మూడు ఫొటోలను నాసా శాస్త్రవేత్తలు విడుదల చేశారు. వాటిని తమ అధికారిక ట్విట్టర్ లో పొందుపరిచారు. హార్డ్ ల్యాండింగ్ కావడం వల్లే విక్రమ్ ల్యాండర్ హైరిజల్యూషన్ కెమెరాలతో తమ ఆర్బిటర్ కెమెరాల ద్వారా తీసిన ఫొటోలకు కూడా అది దొరకలేదని వెల్లడించారు. అయినపప్పటికీ.. ఈ ఫొటోలను మరింత లోతుగా విశ్లేషించాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ల్యాండర్ దిగిన ప్రదేశానికి సంబంధించిన ఫొటోలు, ఇతర డేటా వివరాలను క్షుణ్నంగా విశ్లేషించామని, అయినప్పటికీ దాని జాడ దొరకలేదని తెలిపారు.
తొలి వైఫల్యంగా..ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన చంద్రయాన్ 2 మిషన్.. వైఫల్యం భారతీయులను తీవ్ర నిరాశకు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 7వ తేదీన జాబిల్లి దక్షిణధృవం వైపు ప్రయాణం సాగించిన ల్యాండర్.. నిర్దేశిత ప్రదేశంలోకి దిగుతున్న సమయంలో అదృశ్యమైన విషయం తెలిసిందే. చంద్రుడి ఉపరితలం మీది నుంచి 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉన్నప్పుడు ల్యాండర్ నుంచి సంకేతాలు రావడం స్తంభించిపోయింది. ఇక అంతే. అప్పటి నుంచీ దాని ఆచూకీ ఏమైందో తెలియ రావట్లేదు.
చంద్రుడి మీదే ఉన్నట్లు ధృవీకరించినప్పటికీ..
ల్యాండర్ చంద్రుడి మీద దిగిందని, క్రాష్ ల్యాండింగ్ జరిగి ఉండొచ్చంటూ ఇస్రో ఛైర్మన్ కే శివన్ మరుసటి రోజే ఓ ప్రకటన చేశారు. దానితో అనుసంధానం కావడానికి అన్ని విధాలుగా ప్రయత్నించారు. కొన్ని రోజుల తరబడి ఇస్రో శాస్త్రవేత్తలు వివిధ రూపాల్లో పంపించిన రేడియో సంకేతాలకు ల్యాండర్ ఏ మాత్రం స్పందించలేదు. దీనితో అది నిద్రాణ స్థితి (సైలెంట్ మోడ్) లోకి జారుకుని ఉంటుందని భావించారు. హార్డ్ ల్యాండింగ్ లేదా క్రాష్ ల్యాండింగ్ సమయంలో అది సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయి ఉంటుందని భావించారు.
నాసాకు సైతం అందని ల్యాండర్..
ల్యాండర్ అన్వేషణ కోసం నాసా సైతం బరిలో దిగింది. ఇస్రోతో పోల్చుకుంటే అత్యంత శక్తిమంతమైన సంకేతాలను ల్యాండర్ మీదకి పంపించింది. నాసా శాస్త్రవేత్తల ప్రయత్నాలు కూడా విఫలం అయ్యాయి. దీనితో తమ ఆర్బిటర్ ద్వారా నాసా ల్యాండర్ దిగిన ప్రదేశానికి సంబంధించిన ఫొటోలను తీసింది. ఈ ఫొటోల్లోనైనా దాని ఆచూకీ దొరుకుతుందని ఇన్ని రోజులూ ఆశిస్తూ వచ్చారు. చివరికి నిరాశే మిగిలింది. ఈ ఫొటోలను మరింత లోతుగా విశ్లేషించాల్సి ఉందని నాసా శాస్త్రవేత్తలు ప్రకటించడం ఓ కొసమెరుపు. ఈ విశ్లేషణలోనైనా ల్యాండర్ జాడ దొరుకుతుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.