దొరలు కాదు దొంగలు: ప్రభుత్వ నిధులను కొల్లగొట్టారు..అడ్డంగా బుక్కయ్యారు
కౌలాలంపూర్: మలేషియాలో ఇంటిదొంగలు ఎక్కువయ్యారు. మలేషియా విదేశీ ఇంటెలిజెన్స్ సంస్థ ఛీఫ్తో పాటు ఇతర ఉన్నతాధికారులు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో వారిపై విచారణకు ఆదేశించింది మలేషియా ప్రభుత్వం.మలేషియా అవినీతి నిరోధక శాఖ విచారణ చేసేందుకు రంగంలోకి దిగింది. మలేషియా మాజీ ప్రధాని నజిబ్ రజాక్ హయాంలో ఈ అవినీతి చోటు చేసుకోవడంతో ప్రస్తుత ప్రధాని మహతిర్ మొహ్మద్ విచారణకు ఆదేశించారు.
ఈ వారం మొదట్లో అవినీతినిరోధక శాఖ మలేషియా విదేశీ ఇంటెలిజెన్స్ సంస్థలో పనిచేసిన ఎనిమిది మంది మాజీ అధికారులను అరెస్టు చేసింది. ఇందులో అప్పటి ఇంటెలిజెన్స్ సంస్థ ఛీఫ్గా పనిచేసిన హసనా అబ్దుల్ హమీద్ కూడా ఉన్నారు. మొత్తం 12 మిలియన్ డాలర్ల ప్రభుత్వ నిధులను దారి మళ్లించినట్లు అవినీతిశాఖ తెలిపింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ నిధులను వీరంతా దుర్వినియోగం చేశారని మలేషియా అవినీతి నిరోధక శాఖ డిప్యూటీ కమిషనర్ అజామ్ బాకి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇప్పటి వరకు విచారణాధికారులు 6.5 మిలియన్ డాలర్లను క్యాష్ రూపంలో స్వాధీనం చేసుకున్నారు. ఇతర విలువైన వస్తువులను వేర్వేరు ప్రాంతాల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పరిపాలన రాజధాని అయిన పుత్రజయలోని ప్రధాని కార్యాలయంలో ఉన్న విదేశీ ఇంటెలిజెన్స్ సంస్థ ఆఫీస్ నుంచి కూడా స్వాధీనం చేసుకున్నారు.
యూకేలో శాశ్వత పౌరసత్వం కలిగి ఉన్న మలేషియా పారిశ్రామికవేత్తను కూడా అరెస్టు చేసినట్లు అజామ్ తెలిపారు. విచారణాధికారులు మిగతా ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. మలేషియా స్టేట్ ఫండ్ నుంచి ఈ మొత్తం డబ్బును కాజేసినట్లు విచారణాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది దాదాపు కొన్ని బిలియన్ డాలర్లు ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. ఆ కోణంలోకూడా విచారణ చేస్తున్నట్లు అజాం తెలిపారు. అంతేకాదు ఈ డబ్బును మరో దేశం నుంచి మలేషియాకు తీసుకొచ్చినట్లు చెప్పిన అధికారులు ఆదేశం పేరును వెల్లడించేందుకు నిరాకరించారు.
స్విట్జర్లాండ్, అమెరికాలతో సహా ఆరు దేశాల అధికార సంస్థలు కూడా బిలియన్ డాలర్ల డబ్బులు 1మలేషియా డెవెలప్మెంట్ బెర్హాడ్ (1 ఎమ్డీబీ)నుంచి ఎలా దారి మళ్లాయనే దానిపై విచారణ చేస్తున్నారు. 2009లో 1 ఎమ్డీబీని మాజీ ప్రధాని నజీబ్ స్థాపించారు. ఇదిలా ఉంటే 4.5 బిలియన్ డాలర్లను ప్రభుత్వ నిధుల నుంచి తీసుకుని ఒక ప్రైవేట్ జెట్ విమానం, ఒక సూపర్ యాచ్ (పడవ), పికాసో పెయింటింగ్స్, నగలు, రియల్ ఎస్టేట్లకు వినియోగించినట్లు అమెరికా న్యాయశాఖ తెలిపింది. ఇందులో భాగంగానే మాజీ ప్రధాని నజీబ్ పై మనీలాండరింగ్ కేసు, అవినీతి కేసు, 10 మిలియన్ డాలర్లు 1 ఎమ్డీబీ నుంచి తన సొంత బ్యాంకు అకౌంట్లోకి మళ్లించినట్లు అధికారులు కేసు నమోదు చేశారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని నజీబ్ తెలిపారు.