బంపర్ ఆఫర్: థాయ్లాండ్కు వెళ్లేందుకు బ్యాగులు సర్దుకోండి...
మీరు ప్రపంచ దేశాలు పర్యటించాలంటే అందుకు వీసా తప్పనిసరి. కొన్ని దేశాలు అయితే వీసా ఆన్ అరైవల్ పేరుతో వీసాలు పర్యాటకులకు అందిస్తున్నాయి. కానీ చాలా వరకు దేశాలు మాత్రం ముందుగానే వీసా ఉంటేనే తమ దేశంలోకి అడుగుపెట్టనిస్తున్నాయి. భద్రతా కారణాలతోనే చాలా దేశాలు పర్యాటకులపై ఆంక్షలు విధించాయి. ఒక వేళ మీరు థాయ్ల్యాండ్కు వెళ్లాలనుకుంటే వెంటనే లగేజీ సర్దేసుకోండి. ఎందుకో ఈ కథనం చదవండి మీకే తెలుస్తుంది.
ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందనే భావన
మీరు థాయ్ల్యాండ్కు వెళ్లాలనుకుంటున్నారా... అయితే ఇదే సరైన సమయం. వెంటనే బ్యాగులు సర్దేసుకోండి. టికెట్లను బుక్ చేసుకోండి. అదేంటి వీసా లేకుండా ఎలా వెళ్లడం అని ఆలోచిస్తున్నారా.. ఇకపై ఆ దిగులు లేదు. ఎందుకంటే థాయ్ల్యాండ్కు వచ్చే పర్యాటకులకు వీసా ఆన్ అరైవల్ నిబంధనను తొలగించింది ఆ దేశ ప్రభుత్వం. భారత్తో సహా 21 దేశాలకు ఈ నిబంధనను తొలగించింది. డిసెంబర్ 1, 2018 నుంచి ఇది అమలు కానుంది. ప్రధాన పర్యాటక కేంద్రంగా థాయ్ల్యాండ్ ఉంది. ఇలాంటి నిబంధనలను సడలించడం ద్వారా ఎక్కువ మంది పర్యాటకులు తమ దేశానికి వస్తారని తద్వారా తమ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని భావించింది.
ఒక్కసారిగా తగ్గిన పర్యాటకుల సంఖ్య
ఒకప్పుడు ప్రధాన పర్యాటక కేంద్రాల్లో థాయ్లాండ్ ఒకటిగా నిలిచింది. చాలామంది తమ సెలవులను గడిపేందుకు థాయ్లాండ్కు వెళ్లేవారు. ఇక థాయ్లాండ్కు క్రమంగా పర్యాటకులు తగ్గుతుండటంతో ఆ దేశ ప్రభుత్వం వీసా నిబంధనల్లో కొన్ని దేశాలకు మినహాయింపును ఇచ్చింది. థాయ్లాండ్కు పర్యాటకులు తగ్గడం వెనక కారణం లేకపోలేదు. అక్కడి పర్యావరణంలో సమత్యులత లేకపోవడంతో పాటు ఈ ఏడాది జూలైలో ఫూకెట్లో ఓ పడవ మునిగి 40 మంది చైనా పర్యాటకులు మృతి చెందారు. దీంతో థాయ్ల్యాండ్కు వెళ్లాలంటే పర్యాటకులు ఒక్కింత అనాసక్తి చూపుతున్నారు.
భారత్తో సహా పలు దేశాలకు నిబంధనలు సడలింపు
ఇక వీసా ఆన్ అరైవల్ ఫీజు నుంచి ఈ దేశాలకు మినహాయింపు కలిగిస్తోంది థాయ్లాండ్. భారత్తో సహా మొత్తం 21 దేశాలకు మినహాయింపు ఇస్తోంది. ఇందులో చైనా, తైవాన్, సౌదీ అరేబియా, అందోరా, బల్గేరియా, భూటాన్, సైప్రస్, ఇథియోపియా, ఫిజి, కజకిస్తాన్, లత్వియా, లిత్వేనియా, మాల్దీవులు, మాల్టా, మారిషస్, పాపువా న్యూ గినియా, రొమానియా, సాన్ మారినో, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్లకు సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే థాయ్లాండ్లో 14 రోజుల పాటు మాత్రమే ఉండే అవకాశం ఆ దేశ ప్రభుత్వం కల్పిస్తోంది. పర్యాటక రంగాన్ని ఇప్పుడున్న దానికన్నా 30శాతం అధికంగా వృద్ది చేయాలనే లక్ష్యంతో థాయ్ ప్రభుత్వం పనిచేస్తోంది.