పేలిన అగ్నిపర్వతం: చోటా రాజన్ తరలింపు ఆలస్యం
బాలి: ఇండోనేషియాలోని బాలీలో పట్టుబడిన గ్యాంగ్స్టర్ చోటా రాజన్ భారత తరలింపు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బాలీ సమీపంలో ఉన్న ఓ భారీ అగ్నిపర్వతం పేలి ఆకాశంలో దట్టమైన పొగలు వ్యాపించడంతో విమానాల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడటమే ఇందుకు కారణమని సమాచారం.
తొలుత రాజన్ను మంగళవారం రాత్రికి భారత్ తీసుకురావాలని భావించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం భారత్ నుంచి ముంబై, ఢిల్లీ పోలీసులు, సీబీఐ అధికారుల ప్రత్యేక బృందం కూడా అక్కడికి వెళ్లింది. పనులన్నీ ముగించి, ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది, ఇక బయలుదేరడమే తరువాయి అనుకునే సమయంలో ఈ ఆటంకాలు ఏర్పడ్డాయి.
కాగా, మంగళవారం ఉదయం చోటా రాజన్ మీడియాతో మాట్లాడుతూ.. ముంబై పోలీసుల పైన సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొంతమంది ముంబై పోలీసులకు దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించాడు. దావూద్ ఇబ్రహీంకు తాను భయపడనని చెప్పాడు. ముంబై పోలీసులు తనకు తీరని అన్యాయం చేశారన్నాడు.
దావూద్ ఇబ్రహీంకు, తీవ్రవాదానికి నేను వ్యతిరేకంగా పోరాడుతానని చెప్పాడు. కొంతమంది ముంబై పోలీసులకు దావూద్తో సంబంధాలున్నాయన్నాడు. ప్రభుత్వం తనను ఏ జైలుకు పంపిస్తే ఆ జైలుకు వెళ్తానని చెప్పాడు.
ముంబై పోలీసుల పైన తనకు ఏమాత్రం నమ్మకం లేదని చెప్పాడు. ముంబై పోలీసులు తనను వేధించారని ఆరోపించాడు. వారు తన పట్ల చాలా నీచంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశాడు.