చికాగోలో విధ్వంసం... రెచ్చిపోయిన అల్లరి మూకలు... వందలాదిగా దూసుకెళ్లి లూటీలు...
అమెరికాలోని చికాగోలో సోమవారం తెల్లవారుజామున తీవ్ర అల్లర్లు చెలరేగాయి. వందలాది మంది ఆందోళనకారులు స్థానిక షాపింగ్ మాల్స్,స్టోర్స్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. షాపులను లూటీ చేశారు. చికాగో నగరానికి దక్షిణాన ఆదివారం మధ్యాహ్నం ఓ బ్లాక్ను పోలీసులు చంపేశారన్న ప్రచారంతో ఈ అల్లర్లు చెలరేగాయి. అయితే పోలీసులు మాత్రం ఇది పూర్తిగా అసత్య ప్రచారమని కొట్టిపారేస్తున్నారు. చికాగో నగరంలో హింసను ప్రేరేపించేందుకే ఈ చర్యలకు పాల్పడినట్లు తెలిపారు.
ప్రపంచానికి మరో కొత్త వ్యాధి భయం: ఆ ఐదు దేశాల్లో ముఖ్యంగా..అప్రమత్తం అంటున్న అమెరికా
అసలేం జరిగింది... పోలీసుల వెర్షన్...
చికాగో పోలీస్ సూపరింటెండ్ డేవిడ్ బ్రౌన్ మాట్లాడుతూ... ఎంగిల్వుడ్ ప్రాంతంలో ఓ వ్యక్తి గన్తో సంచరిస్తున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. హుటాహుటిన అక్కడికి చేరుకుని అతన్ని(20)బగుర్తించారని... కాలి నడకన అతన్ని వెంబడించారని చెప్పారు. ఈ క్రమంలో అతను కాల్పులు జరపగా... పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. ఈ కాల్పుల్లో అతను గాయపడ్డాడని... అయితే ప్రమాదమేమీ లేదని అన్నారు. ప్రస్తుతం అతను యూనివర్సిటీ ఆఫ్ చికాగో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని,అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.
చికాగోని ధ్వంసం చేశారని...
ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో తీవ్ర ప్రచారం జరిగింది. పోలీసులు ఆ బ్లాక్ని చంపేసినట్లుగా ప్రచారం జరగడంతో వందలాది మంది దీన్ని నిరసిస్తూ వీధుల్లోకి వచ్చారు. ఈ క్రమంలో లూటీలకు పాల్పడగా.. పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు గాయపడ్డారు. దాదాపు 100 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ... అది నిరసన కాదని... పూర్తిగా నేరపూరిత ఉద్దేశంతోనే లూటీలకు తెగబడ్డారని ఆరోపించారు. చికాగో మేయర్ లోరి లైట్ఫుట్ మాట్లాడుతూ... క్రిమినల్స్ అంతా చికాగోను ధ్వంసం చేస్తున్నారని... ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చికాగో ప్రెసిడెంట్ మ్యాడీ క్విన్ మాట్లాడుతూ... తమ కళ్ల ముందే నగరాన్ని ధ్వంసం చేశారని... అందమైన నగరాన్ని కకావికలం చేశారని వాపోయారు.
వ్యాపారులపై కోలుకోని దెబ్బ...
ప్రస్తుతం 400 వరకు పోలీసులు చికాగోలోని డౌన్టౌన్ ప్రాంతంలో మోహరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు ఆంక్షలు విధించారు. ఆ ప్రాంతంలో రాత్రి 8గం. నుంచి దయం 6గం. వరకు రాకపోకలను నిలిపివేశారు. ఈ ఏడాది మే నెలలో జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం తర్వాత చెలరేగిన అల్లర్లలో చికాగోలోని పలు షాపులు కూడా లూటీకి గురయ్యాయి. పలు షాపులు ధ్వంసమయ్యాయి. దాని నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న తరుణంలో మరోసారి అదే పునరావృతమవడంపై అక్కడి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి అల్లర్లలో ధ్వంసమైన తన షాపును మళ్లీ నిర్మించుకోవడానికి ఆరున్నర వారాలు పట్టిందని... ఇప్పుడు అల్లరి మూకలు మళ్లీ తన షాపును ధ్వంసం చేశారని జిమ్మర్మ్యాన్ అనే జువెలరీ వ్యాపారి వాపోయారు.
జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతంతో...
జాత్యహంకార విద్వేషంతో శ్వేత జాతి పోలీసులు జార్జ్ ఫ్లాయిడ్ అనే బ్లాక్ని హత్య చేయడంతో ఈ ఏడాది అమెరికాలో తీవ్ర అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఫ్లాయిడ్ మెడపై బూటు కాలితో తొక్కి నేలకు గట్టిగా అదిమిపట్టడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా 'ఐ కాంట్ బ్రీత్' పేరుతో బ్లాక్ ఉద్యమం పుట్టుకొచ్చింది. అన్ని వర్గాలు ఈ ఉద్యమానికి మద్దతు పలికాయి. కార్పోరేట్ కంపెనీలు సైతం తమ మద్దతును ప్రకటించాయి. ఇదే క్రమంలో తాజాగా మరోసారి అల్లర్లు చెలరేగడం చర్చనీయాంశంగా మారింది. బ్లాక్ని హత్య చేసినందుకే అల్లర్లు పుట్టుకొచ్చాయా... లేక అల్లరి మూకలే కావాలని రెచ్చిపోయాయా అన్నది తేలాల్సి ఉంది.