అమ్మానాన్నల స్మార్ట్ ఫోన్ వాడకంపై నిరసన.. రోడ్డెక్కిన బుడతలు
హంబర్గ్ : స్మార్ట్ఫోన్.. మనిషి జీవితాన్ని మార్చివేసింది. అయితే బంధాలు అనుబంధాలను మాత్రం దూరం చేసింది. పిల్లలు పెద్దలన్న తేడా లేదు.. ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్కు బానిసై పోయారు. పిల్లలు గేమ్స్ ఆడుతూ బిజీ అయిపోతే.. తల్లిదండ్రులు సోషల్ మీడియాలో నిమగ్నమవుతున్నారు. పేరెంట్స్ ఇద్దరూ స్మార్ట్ఫోన్లు చేతిలో పట్టుకుని తమను పట్టించుకోవడంలేదని బాధపడే పిల్లలు మరికొందరున్నారు. అమ్మానాన్నలిద్దరూ స్మార్ట్ ఫోన్తో తలదూర్చడంతో ఎవరితో మాట్లాడాలో ఎవరికి కబుర్లు చెప్పాలో తెలియక చిన్నారులు సతమతమవుతున్నారు. జర్మనీలో ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొంటున్న ఓ బుడతడు తనలాంటి వారిని ఏకం చేశాడు. మమ్మీ డాడీ స్మార్ట్ ఫోన్ వదలి పెట్టండంటూ నిరసన ప్రదర్శన చేపట్టాడు.
పేరెంట్స్ స్మార్ట్ ఫోన్ల వినియోగానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ప్రదర్శనకు ఏడేళ్ల ఎమిల్ నేతృత్వం వహించాడు. ప్లకార్డులు పట్టుకుని మేమున్నామని గుర్తించండి, మాతో ఆడండి స్మార్ట్ ఫోన్లతో కాదంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ నిరసన ప్రదర్శన ద్వారానైనా తల్లిదండ్రులు తమ బాధను అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని పిల్లలు చెబుతున్నారు.
జర్మనీలోని హంబర్గ్లో చేపట్టిన ఈ నిరసన ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎమిల్ ఉద్యమానికి పెద్దలు కూడా సహకరించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎమిల్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు నిరసనలో పాల్గొన్న చిన్నారులపై సానుభూతి తెలుపుతున్నారు.