చిలీలో భూకంపం: ఐదుగురు మృతి, జపాన్కు ముప్పు
శాంటియాగో: చిలీలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 8.2గా నమోదైంది. ఈ భూకంపంలో ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. స్వల్పంగా ఆస్తి నష్టం సంభవించింది. చిలీకి పొరుగున వున్న పెరూ, ఈక్వెడార్ దేశాల్లో సునామీ హెచ్చరిక జారీ చేశారు.
సముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో తీరప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. పెరూలోనూ భూకంప తీవ్రత కనిపించడంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. చిలీలో 2010లో వచ్చిన భారీగా భూకంపంలో 500 మందికి పైగా మృతి చెందగా, భారీ ఆస్తినష్టం సంభవించిన విషయం తెలిసిందే.
ఇదిలావుంటే, చిలీ భూకంప ప్రమాదం జపాన్ను కూడా తాకవచ్చునని జపాన్ మెటీరియోలాజికల్ ఏజెన్సీ హెచ్చరించింది. గురువారం ఉదయం భూకంపం జపాన్ సముద్ర తీరాన్ని తాకవచ్చునని హెచ్చరించింది.
మొదటి తాకిడి హోక్కాయిడో పసిఫిక్ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు చెప్పింది. తాజా పరిణామాన్ని పరిశీలించి బుధవారం సాయంత్రం వివరాలు తెలియజేయనున్నట్లు తెలిపింది.