మరో ఫ్లైట్ మిస్సింగ్: 38 మందితో..మిలటరీ విమానం అదృశ్యం
శాంటియాగో: మరో విమాన దుర్ఘటన చోటు చేసుకుంది. సుమారు 230 మందికి పైగా ప్రయాణికులతో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ కు వెళ్తూ అదృశ్యమైన మలేసియా విమానం తరహాలోనే ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ గల్లంతైంది. దాని ఆచూకీ తెలియరాలేదు. విమానం జాడను కనుగొనడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి. అంటార్కిటికా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిలీ వైమానిక దళానికి చెందిన విమానం అది.
శ్రీలంక తమిళ శరణార్థులను మాటేమిటి? లక్షమందికి పైగా: వారికీ..: శ్రీశ్రీ రవిశంకర్
చిలీలోని పుంటా ఎరినాస్ విమానాశ్రయం నుంచి ఆ దేశ కాలమానం ప్రకారం.. సాయంత్రం 4:55 నిమిషాలకు అంటార్కిటికాకు బయలుదేరింది ఈ విమానం. ఆ సమయంలో అందులో 21 మంది వైమానిక దళ జవాన్లు, ముగ్గురు పౌరులు, 17 మంది విమాన సిబ్బంది ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం.. సాయంత్రం 6 గంటలకు అంటార్కటికాలో చిలీ ఎయిర్ బేస్ లో ల్యాండ్ కావాల్సి ఉంది. టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటి తరువాత కింగ్ జార్జ్ ఐలండ్ సమీపంలో గగనతలంపై ఈ ఎయిర్ క్రాఫ్ట్ మాయమైంది.
రాడార్ తో సంబంధాలను కోల్పోయింది. రాడార్ తో సంబంధాలను తెగిపోయే సమయానికి ఈ ఎయిర్ క్రాఫ్ట్ పుంటా ఎరినాస్ విమానాశ్రయానికి 390 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. అంటార్కిటికాలోని చిలీ ఎయిర్ బేస్ కు 280 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు చివరిసారిగా ఈ విమానం నుంచి సందేశం అందినట్లు వైమానిక దళ అధికారులు చెబుతున్నారు. ఈ విమానం క్రాష్ ల్యాండ్ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు చిలీ సైన్యాధికారి జనరల్ ఫ్రాన్సిస్కో టొర్రెస్ తెలిపారు. రాడార్ తో సంబంధాలు తెగిపోయే సమయానికి ఆకాశం నిర్మలంగానే ఉందని, వాతావరణంలో పెనుమార్పులేవీ చోటు చేసుకోలేదని అన్నారు.
క్రాష్ ల్యాండ్ ఎక్కడ జరిగి ఉండొచ్చనే అంశంపై ఆరా తీస్తున్నామని వెల్లడించారు. విమానంలో ఉన్న సిబ్బంది తాజా పరిస్థితులు ఏమిటనే విషయంపై ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ధారణ చేయలేమని చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెర్రా వెల్లడించారు. విమానం జాడ తెలియాల్సి ఉందని అన్నారు. దీనికోసం యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలను చేపట్టినట్లు తెలిపారు. అంటార్కిటా వైపు నుంచి తమ దేశ ఎయిర్ బేస్ అధికారులు అన్వేషణ కొనసాగిస్తున్నారని, త్వరలోనే జాడ తెలుస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.