కరోనాపై తొలిసారిగా పెదవి విప్పిన జిన్పింగ్: అధికారికంగా: ఓపెన్ అండ్ ట్రాన్స్పరెన్సీ
బీజింగ్: కరోనా వైరస్ రూపంలో ప్రపంచానికి చావును సరికొత్తగా పరిచయం చేసింది చైనా. హ్యూబె ప్రావిన్స్లోని వుహాన్ సిటీలో ఓ ఫిష్ మార్కెట్లో పుట్టుకొచ్చినట్టుగా భావిస్తోన్న కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసి పారేస్తోంది. అల్లకల్లోలానికి గురి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంది. రోజురోజుకు, గంటగంటకూ భయానకంగా విస్తరిస్తోంది. కరోనాకు జన్మనిచ్చినట్టుగా భావిస్తోన్న చైనా మాత్రం ఈ మహమ్మారి ప్రభావం నుంచి శరవేగంగా బయటపడగలిగింది.
Recommended Video
దేశాన్ని బెంబేలెత్తిస్తోన్న కరోనా మరణాలు: ఒక్కరోజే 1133 మంది వైరస్ కాటుకు బలి: కేసులు కాస్త తగ్గినా
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించుకోగలిగింది. ఆర్థికంగా పుంజుకుంటోంది. కరోనా వైరస్ విషయంలో ప్రపంచ దేశాలు చైనాను దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్పింగ్ తొలిసారిగా స్పందించారు. అధికారిక ప్రకటన చేశారు. కరోనా వైరస్ను నివారించడానికి అలుపెరుగని పోరాటం చేసిన ఫ్రంట్లైన్ వారియర్లు, వైద్యరంగ నిపుణులను సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజధాని బీజింగ్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన అనంతరం.. దాని మీద జిన్పింగ్ విస్తృతంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. కరోనా వైరస్పై తాము పారదర్శకంగా వ్యవహరించామని జిన్పింగ్ అన్నారు. ఎలాంటి దాపరికాలు లేకుండా ప్రవర్తించామని చెప్పారు. కరోనా మరణాల బారి నుంచి ప్రజలను రక్షించడానికి గట్టి చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఫలితంగా- మరణాల సంఖ్య పరిమితంగా నమోదైందని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల ప్రజలు మృత్యువాత పడకుండా తమవంతు కృషి చేశామని జిన్పింగ్ తెలిపారు. కరోనా మరణాలను నియంత్రించడంలో శక్తివంచన లేకుండా కృషి చేశామని అన్నారు. కరోనా వంటి మహమ్మారి కాటు నుంచి దేశ ప్రజలను కాపాడుకోగలిగామని చెప్పారు. తాము తీసుకున్న చర్యలు.. దేశ శక్తి, సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పాయని చెప్పారు. కరోనా ప్రభావం నుంచి శరవేగంగా కోలుకోగలిగామని, ఆర్థికంగా పుంజుకొంటున్నామని జిన్పింగ్ తెలిపారు.