పాక్ను వేలెత్తి చూపొద్దు: అమెరికాకు తేల్చి చెప్పిన చైనా
బీజింగ్: ఉగ్రవాదులకు స్వర్గధామంగా కొనసాగుతున్న పాకిస్థాన్కు ప్రపంచంలో ఏదైనా దేశం మద్దతుగా ఉందంటే అది చైనానేనని అందరికీ తెలిసిన విషయమే. తాజాగా చైనా చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
పాక్కు న్యూ ఇయర్ షాక్: ఫూల్స్ చేశారంటూ ట్రంప్ ఫైర్, తీవ్ర హెచ్చరిక
ఉగవాదాన్ని కట్టడి చేయడంలో విఫలమైన నేపథ్యంలో తాము అందజేస్తున్న వందల కోట్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఇటీవల అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిర్ణయంపై పాకిస్థాన్ తోపాటు చైనా కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం ఆ దేశాల మధ్య స్నేహానికి నిదర్శనం.
పాక్ను వేలెత్తి చూపొద్దు
అంతేగాక, పాక్పై వేలెత్తి చూపొద్దని అమెరికాకు చైనా సూచించడం గమనార్హం. ప్రపంచంలో ఉగ్రవాదాన్ని ఆయా దేశాలతో ముడిబెట్టే యత్నాలను చైనా అంగీకరించబోదని స్పష్టం చేసింది.
పాక్ ఎన్నో త్యాగాలు చేసింది
చైనా విదేశాంగ ప్రతినిధి లుకాంగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉగ్రవాదం నియంత్రణలో పాక్ ఇప్పటికే ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. ఒక దేశాన్ని మరో దేశం తప్పుబట్టే బదులు పరస్పరం సహకరించుకుంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించవచ్చన్నారు. అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు అన్ని దేశాల సహకారం కీలకమన్నారు.
అంతర్జాతీయ ఉగ్రవాదికి చైనా మద్దతు
ఇటీవలి కాలంలో చైనా-పాకిస్థాన్ ఆర్థక నడవాలో భాగంగా పాక్లో చైనా భారీగా పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే. దీంతో పాటు పాక్లోని గ్వదర్ నౌకాశ్రయం సమీపంలోని జివానీలో చైనా ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. చైనాకు పాక్ ఆప్తమిత్రుడిగా మారడంతో ఉగ్రవాది మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి యత్నాలకు అడ్డుపడుతున్న విషయమూ తెలిసిందే. ఈ చర్యను భారత్ ఖండించింది.
అమెరికాకు తెలిసొచ్చి..
దాదాపు మూడుదశాబ్దాలుగా పాక్కు అమెరికా సైనిక సాయం అందజేసింది. తాలిబాన్, హక్కానీ నెట్వర్క్, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్ తొయిబా... తదితర సంస్థలపై పోరాటానికి నిధులు సమకూర్చింది. అయితే పాక్ మాత్రం ఆ నిధులు, ఆయుధాలను భారత వ్యతిరేక పోరాటానికి కేటాయిస్తుండటం గమనార్హం. గతంలోనే దీనికి సంబంధించి పలు పరిశోధనా వార్తలు బయటకు వచ్చినప్పటికీ అప్పట్లో అమెరికా పట్టించుకోలేదు. తాజాగా అధ్యక్షుడు ట్రంప్ ఈ అంశంపై పలు హెచ్చరికలు జారీ చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. చివరకు పాకిస్థాన్కు ఆర్థిక సాయం నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనై చైనా పైవిధంగా స్పందించింది.