చైనాలో అసలేం జరిగింది.. త్వరలోనే నిజాలు.. దర్యాప్తుకు జిన్ పింగ్ గ్రీన్ సిగ్నల్..
గత మూడు నెలలుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కానీ ఇప్పటికీ దాని మూలాలపై స్పష్టత లేదు. వైరస్ జన్మస్థానం చైనాలోని వుహాన్ అనే బలమైన వాదన ఉన్నప్పటికీ.. అది కాకపోవచ్చునేమోనన్న వాదన కూడా లేకపోలేదు. కానీ వైరస్ వ్యాప్తి చైనా నుంచే ఎక్కువగా జరిగిందన్నది నిర్వివాదాంశం. చైనా డబ్ల్యూహెచ్ఓ(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్)కు సరైన సమాచారం ఇవ్వకపోవడం.. ప్రమాదకర సంకేతాలు కనిపిస్తున్నా ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందన్న విమర్శలున్నాయి.
Recommended Video
అంతేకాదు,కరోనా కేసుల విషయంలోనూ చైనా తప్పుడు లెక్కలే ప్రపంచం ముందు పెట్టిందన్న ఆరోపణలున్నాయి. ఇదంతా చైనా కావాలనే చేసిందా.. దీని వెనకాల కుట్ర కోణం ఏమైనా ఉందా.. అన్నది గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. బహుశా.. తమపై పడ్డ నిందలను కడిగేసుకోవాలని చైనా నిర్ణయించుకున్నట్టుంది. కరోనా వైరస్కు సంబంధించి చైనాపై దాదాపు 100 దేశాలు చేసిన 'దర్యాప్తు' డిమాండుకు ఆ దేశాధ్యక్షుడు జిన్పింగ్ సమ్మతించారు. ఆ 100 దేశాల్లో భారత్ కూడా ఒకటి కావడం గమనార్హం.
జిన్ పింగ్ ఏమన్నారు..
చైనాపై దర్యాప్తుకు యూరోపియన్ యూనియన్ రూపొందించిన తీర్మానానికి 100కి పైగా దేశాలు మద్దతు తెలపడంతో జిన్పింగ్ దీనిపై స్పందించారు. కరోనా వైరస్ బయటపడ్డ సమయంలో చైనా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, ఓపెన్నెస్(సమాచారాన్ని బహిర్గతపరచడం)తో వ్యవహరించామని జిన్ పింగ్ సోమవారం వరల్డ్ హెల్త్ అసెంబ్లీకి తెలిపారు. ప్రపంచ స్పందన మేరకు దీనిపై సమగ్ర సమీక్షకు చైనా ముందుకు వస్తోందన్నారు. అయితే ప్రపంచ దేశాల ప్రస్తుత ప్రాధాన్యత వైరస్ నుంచి ప్రజలను కాపాడటం పైనే ఉండాలని... వైరస్పై పట్టు బిగించిన తర్వాతే దర్యాప్తుకు సంబంధించిన చర్యలు మొదలుపెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ ఏమన్నారు..
ఇలాంటి క్లిష్ట తరుణంలో డబ్ల్యూహెచ్ఓకి మద్దతుగా నిలవాలంటే ప్రపంచ దేశాల సహకారం అవసరమని జిన్పింగ్ అన్నారు. దీనిపై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అదనోమ్ మాట్లాడుతూ.. 'మనందరం కరోనా నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతీ దేశం,ప్రతీ సంస్థ కరోనాపై పోరులో తమ పోరాటాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అనుభవం నుంచే కొత్త పాఠాలు నేర్చుకోవాలి. డబ్ల్యూహెచ్ఓ పారదర్శకతకు,జవాబుదారీతనానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది. అదే పద్దతిని కొనసాగిస్తుంది.' అని చెప్పారు.
డబ్ల్యూహెచ్ఓకి శల్య పరీక్ష..
చైనాపై దర్యాప్తు తీర్మానాన్ని ఆస్ట్రేలియా,యూరోపియన్ యూనియన్ ప్రపంచం ముందుకు తెచ్చాయి. ఇప్పటివరకూ దాదాపు 120కి పైగా దేశాలు మద్దతు తెలిపాయి. ఈ దర్యాప్తు మొదలైతే డబ్ల్యూహెచ్ఓకి కూడా శల్య పరీక్ష తప్పదు. ఎందుకంటే,చైనాను డబ్ల్యూహెచ్ఓ గుడ్డిగా నమ్మి వెనకేసుకొచ్చిందన్న విమర్శలున్నాయి. గతేడాది సెప్టెంబర్/అక్టోబర్ నెలలోనే అక్కడ వైరస్ బయటపడితే.. ఈ ఏడాది జనవరి 30 వరకు డబ్ల్యూహెచ్ఓ దాన్ని మహమ్మారిగా ప్రకటించలేదు. పైగా ఫిబ్రవరి 3న డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ మాట్లాడుతూ.. 'ఇంటర్నేషనల్ ట్రావెల్ & వాణిజ్యంలో అనవసరంగా జోక్యం చేసుకునే చర్యలు అవసరం లేదు.' అని అన్నారు. దీంతో చైనా నుంచి చాలామంది వేరే దేశాలకు ప్రయాణించడం.. అన్ని దేశాలకు వైరస్ వ్యాప్తి చెందడం జరిగింది.
అసలేం జరిగిందో బయటపడుతుందా..
చైనాలో కరోనా వైరస్ విషయాన్ని గతేడాది సెప్టెంబర్లోనే లీ వెన్లియాంగ్ అనే డాక్టర్ బయటపెట్టాడు. అయితే అతను అకారణంగా సమాజంలో అలజడి రేపుతున్నాడని ప్రభుత్వం అతన్ని నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసింది. ఆ తర్వాత అతను బయటకొచ్చినప్పటికీ.. అప్పటికే అతను కరోనా వైరస్ బారినపడటంతో మృతి చెందాడు. ఓ ట్రావెలర్ సైతం తన బ్లాగులో కరోనా గురించి కొన్ని నిజాలను ప్రస్తావించినందుకు ఆమెను అరెస్ట్ చేశారన్న ఆరోపణలున్నాయి. ఇదంతా పక్కనపెడితే.. ప్రపంచం మొత్తానికి వ్యాప్తి చెందిన కరోనా.. చైనాలో మాత్రం వుహాన్కే పరిమితమవడం పెద్ద ఆశ్చర్యం. కుట్ర కోణాలపై సందేహాలకు ఇది ఊతమిచ్చింది. కరోనా వైరస్ కేసుల విషయంలో చైనా అబద్దాలు చెబుతోందా అన్న సందేహాలను కూడా కలిగించింది. ఏదేమైనా ఇప్పుడు చైనాపై ఐరాస అనుబంధ సంస్థ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ దర్యాప్తు జరిపితే.. చైనాలో అసలేం జరిగిందో బయటపడే అవకాశం ఉంది.