చైనాలో అమెరికా ఎంబసీ వద్ద పేలుడు: దుండగుడి చేతిలోనే పేలిన బాంబు
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద బాంబు పేలుడు సంభవించింది. గురువారం ఉదయం ఎంబసీ సమీపంలో పేలుడు శబ్దాలు వినిపించడంతో భయాందోళనకు గురైన స్థానికులు ఘటనా స్థలానికి దూరంగా పరుగులు తీశారు. పేలుడు సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు.
ఈ పేలుడుకు పాల్పడింది చైనాకు చెందిన 26ఏళ్ల వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 1.00 గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇన్నర్ మంగోలియా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అమెరికా రాయబార కార్యాలయం ఎదుట బాంబు దాడికి యత్నించాడు. అయితే అది అతడి చేతిలోనే పేలిపోయింది.
这是美国大使馆现场吗? pic.twitter.com/dI8j9FVIcj
— tbn (@tanboniu) July 26, 2018
బాంబు తీవ్రత తక్కువగా ఉండటంతో నిందితుడు మినహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చైనా పోలీసులు తెలిపారు. నిందితుడి పూర్తి వివరాలను దాడికి గల కారణాలను పోలీసులు వెల్లడించలేదు.
ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే భారత ఎంబసీ కూడా ఉంది. బాంబు పేలుడుకు సంబంధించిన ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే, బాంబు పేలుడు జరిగిన కొద్ది సేపటికే ఓ యువతి అమెరికా రాయబార కార్యాలయం ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవాలని ప్రయత్నించిన ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ఘటనపై ఎలాంటి అధికారిక వివరాలు వెలువడలేదు.