ఏం మారలేదు... పాంగోంగ్ వద్ద చైనా అదే దూకుడు... శాటిలైట్ చిత్రాలు బయటపెట్టిన వాస్తవాలు...
తూర్పు లదాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి వున్న ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి భారత్-చైనా సైన్యం ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే పాంగోంగ్ సరస్సు ప్రాంతంలో మాత్రం చైనా మరిన్ని బోట్లను మోహరించడం,కొత్తగా టెంట్లు ఏర్పాటు చేయడం శాటిలైట్ చిత్రాల ద్వారా వెలుగుచూసింది. ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే కథనం ప్రకారం జూలై 29న అందిన శాటిలైట్ చిత్రాల్లో ఫింగర్ 5,ఫింగర్ 6 ప్రాంతాల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 13 బోట్లు ఉన్నట్లు వెల్లడైంది.
Recommended Video
అదనపు బోట్లు దేనికి సంకేతం...
ఫింగర్ 5 వద్ద మూడు బోట్లు ఉండగా.. ఫింగర్ 6 వద్ద 10 బోట్లు ఉన్నట్లు శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తోంది. ఒక్కో బోటు కనీసం 10 మంది సైనికులను తరలించగలదు. అంటే ఈ లెక్కన 130మంది చైనీస్ ఆర్మీ ఫింగర్ 4కి సమీపంలో మోహరించబడ్డారు. జూన్ 15న భారత్-చైనా మధ్య గాల్వన్ వ్యాలీలో ఘర్షణ తలెత్తిన రోజు... ఇక్కడ 8 బోట్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు అదనంగా మరికొన్ని బోట్లు వచ్చి చేరాయి. దీన్నిబట్టి చైనా అక్కడ తమ సైనిక బలాన్ని పెంచుకునే ఏర్పాట్లలో ఉన్నట్లు అర్థమవుతోంది.నిజానికి ఈ ప్రాంతం మొదటి నుంచి భారత్ ఆధీనంలో ఉంది. వ్యూహాత్మక పరిగణించే ఫింగర్ 4 వద్దకి శత్రు బలగాలు చేరితే... పాంగోంగో సరస్సులో భారత్ గస్తీ ఏర్పాట్లు,సైన్యం కదలికలు ప్రత్యర్థులుకు సులువుగా తెలిసిపోతాయి.
ఫింగర్ 4 వరకూ విస్తరించే పనిలో...
పాంగోంగ్ సరస్సుకు సమీపంలోని ప్రాంతాల్లో చైనా అదనపు బోట్లను మోహరించడం ఆందోళన కలిగించే విషయం. గతంలో ఈ బోట్లు ఫింగర్ 8కి దూరంలో మోహరించబడి ఉండేవి. కానీ ఇప్పుడు ఫింగర్ 5,6 ప్రాంతాల్లో అదనపు బోట్లు కనిపించడం.. ఫింగర్ 4 వరకూ చైనా తమ బలగాలను విస్తరించే పనిలో ఉన్నట్లు స్పష్టమవుతోందని లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా తెలిపారు. ప్రస్తుతం లదాఖ్లో జరుగుతున్న ఆపరేషన్స్కు హుడా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.
శీతాకాలానికి ముందుగానే సన్నద్దమై...
జూలై 29 నాటికి ఫింగర్ 5 వద్ద 40 ప్రీఫాబ్రికేటెడ్ హట్స్,15 టెంట్లు ఉన్నట్లుగా శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తోంది. అయితే ఇందులో నాలుగు అదనపు టెంట్లు అక్కడ మోహరించిన బోట్ సిబ్బందికి సంబంధించినవై ఉండవచ్చునన్న వాదన వినిపిస్తోంది. విపరీతమైన చలిని సైతం తట్టుకునే ప్రీఫాబ్రికేటెడ్ హట్స్ నిర్మాణాన్ని బట్టి... చైనా శీతాకాలన్ని దృష్టిలో పెట్టుకుని,అక్కడ సుదీర్ఘ కాలం ఉండేందుకే వాటిని నిర్మించినట్లు స్పష్టమవుతోంది.
భారత్ కూడా ధీటుగా...
ఒక్కో హట్లో దాదాపు 12 మంది సైనికులు ఆశ్రయం పొందుతారు. ఈ లెక్కన అక్కడి 40 హట్స్లో 480 మంది సైనికులు ఆశ్రయం పొందవచ్చు. ఇలాంటి గుడిసెల్లో శీతాకాలంలో ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయని...చైనా కచ్చితంగా శీతాకాలం కోసం సిద్దమయ్యే ఈ హట్స్ను ఏర్పాటు చేసి ఉండవచ్చునని లెఫ్టినెంట్ జనరల్ హుడా అన్నారు. అక్కడ టెంట్ల సంఖ్య క్రమంగా పెరగడం చైనా అక్కడ తమ బలగాల సంఖ్యను పెంచుతున్నట్లే అన్న వాదన వినిపిస్తోంది. ఓవైపు సైన్యం ఉపసంహరణకు చర్చలు జరుగుతున్నప్పటికీ... పాంగోంగ్లో యథాతథ స్థితిని కొనసాగిస్తూ ఇప్పటికీ చైనా తమ సైన్యాన్ని పూర్తిగా వెనక్కి రప్పించలేదు.చైనా తీరును పరిశీలిస్తున్న భారత్... పాంగోంగ్ వద్ద చైనాకు ధీటుగా బదులిచ్చేందుకు సన్నద్దమవాలని భావిస్తోంది.