చంద్రుడి శిలలను మోసుకొచ్చిన చైనా స్పేస్క్రాఫ్ట్: భూమిపై ల్యాండ్: ఇక చైనా టార్గెట్ అదే
బీజింగ్: చైనా మరో ఘనతను సాధించింది. చంద్రుడిపై ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. అక్కడి మట్టి, రాళ్లు, ఇతర ఖనిజ పదార్థాలను సేకరించింది. జాబిల్లిపై ప్రయోగాలను చేపట్టడానికి ఉద్దేశించిన స్పేస్క్రాఫ్ట్..భూమికి తిరిగొచ్చింది. చైనా ప్రయోగించిన మానవ రహిత స్పేస్క్రాఫ్ట్ చాంగ్ఈ-5 చందమామ ఉపరితలంపై నుంచి భూమికి చేరినట్లు చైనా ప్రకటించింది. మంగోలియాలో ల్యాండ్ అయినట్లు తెలిపింది. ఈ మేరకు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్ఎస్ఏ) ఓ ప్రకటన విడుదల చేసింది.
డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ పాస్వర్డ్ ఏమిటో తెలుసా: బయట పెట్టిన హ్యాకర్
వారం రోజుల్లోనే చంద్రుడి మీదికి..
కిందటి నెల 24వ తేదీన ప్రయోగించిన ఈ స్పేస్క్రాఫ్ట్.. ఏడు రోజుల వ్యవధిలోనే చంద్రుడిపైకి చేరింది. చైనాలోని హైనాన్ ప్రావిన్సులో గల వెన్చాంగ్ స్పేస్క్రాఫ్ట్ లాంచింగ్ స్టేషన్ నుంచి సీఎన్ఎస్ఏ శాస్త్రవేత్తలు దీన్ని ప్రయోగించారు. లాంగ్మార్చ్-5 రాకెట్ ద్వారా కిందటి నెల 24వ తేదీన తెల్లవారు జామున 4.30 గంటలకు అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. నిర్దేశిత పాత్ వేలో ప్రయాణించిన ఈ చాంగ్ఈ-5 ప్రోబ్.. చంద్రుడిపై `ఓషన్ ఆఫ్ స్టార్మ్స్` అనే ప్రాంతంలో వాలింది.
4.4 పౌండ్ల బరువు ఉన్న శిలలు
ఈ ప్రోబ్కు ప్రత్యేకంగా అమర్చిన రోబోటిక్ హ్యాండ్ ద్వారా చంద్రుడి ఉపరితలంపై సుమారు రెండు మీటర్ల పాటు డ్రిల్లింగ్ చేసి, అక్కడి శిలలు, మట్టి, దుమ్మును సేకరించింది. 4.4 పౌండ్ల బరువు గల చంద్రశిలలు, మట్టిని సేకరించిందా స్పేస్క్రాఫ్ట్. రెండు రోజుల తరువాత భూమికి తిరుగు ప్రయాణమైంది. మూడువారాల పాటు ప్రయాణించిన అనంతరం భూమికి చేరుకుంది. మంగోలియా మారుమూల ప్రాంతంలో దిగింది. ఈ విషయాన్ని సీఎన్ఎస్ఏ ప్రకటించారు.
మంగోలియాలో వాలిన స్పేస్క్రాఫ్ట్
మంగోలియా కాలమానం ప్రకారం.. తెల్లవారు జామున 2 గంటలకు ఈ క్యాప్సుల్ భూమిపై దిగినట్లు తెలిపారు. అట్లాంటిక్ మహాసముద్రం దక్షిణ ప్రాంత ఉపరితలంపై మూడువేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడే.. ప్రధాన స్పేస్క్రాఫ్ట్ నుంచి ఈ క్యాప్సుల్ విడిపోయిందని పేర్కొన్నారు. అనంతరం తాము నిర్దేశించిన ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు స్పష్టం చేశారు. క్యాప్సుల్ భూమిపైకి వాలిన గంట తరువాత.. సీఎన్ఎస్ఏ శాస్త్రవేత్తలు దాని వద్దకు చేరుకున్నారు. చంద్రశిలలను విజయవంతంగా భూమిపైకి తీసుకొచ్చిన మూడో దేశంగా రికార్డు సృష్టించింది.. చైనా.
అమెరికా, సోవియట్ తరువాత..
ఇదివరకు అమెరికా, సోవియట్ యూనియన్ మాత్రమే ఈ ఘనతను సాధించాయి. చాంగ్ఈ-5 ప్రోబ్ స్సేస్క్రాఫ్ట్ల సిరీస్లో ఇది మూడోది. చివరి రెండు స్పేస్క్రాఫ్ట్లను కూడా చంద్రుడి మీదికే ప్రయోగించింది చైనా. చాంగ్ఈ-3.. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టగా.. చాంగ్ఈ-4 ప్రస్తుతం చంద్రుడి మీదే ప్రయోగాలను సాగిస్తోంది. గత ఏడాది జనవరిలో ప్రయోగించిన చాంగ్ఈ-4 రెండేళ్ల పాటు అక్కడే గడుపుతుంది. దానికి అమర్చిన యుటు-2 రోవర్.. ద్వారా చందమామ ఫొటోలను సేకరిస్తున్నారు చైనా శాస్త్రవేత్తలు.
Recommended Video
ఇక చైనా టార్గెట్.. అదే
చైనా అంతరిక్ష పరిశోధకులు తదుపరి లక్ష్యం.. స్పేస్ స్టేషన్ నిర్మాణం. దీనికోసం వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భూమి కక్ష్య చుట్టూ పరిభ్రమించేలా ప్రత్యేకంగా స్పేస్ స్టేషన్ను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు ప్రత్యామ్నాయంగా దీన్ని నిర్మించాలని చైనా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అమెరికా, రష్యాలు సంయుక్తంగా ప్రస్తుత స్పేస్ స్టేషన్ను నిర్మించాయి. చైనా తాజాగా తీసుకొచ్చిన శిలలతో చంద్రుడిపై కొత్త తరహాలో ప్రయోగాలను సాగించడానికి, నూతన అంశాలను వెలికి తీయడానికి ఉపకరిస్తుందని అంటున్నారు.