చైనా కనుగొన్న వ్యాక్సిన్ సక్సెస్.. పాకిస్తాన్కు సరఫరా చేస్తామన్న డ్రాగన్ కంట్రీ
కరోనావైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న క్రమంలో ఆయా దేశాలు ఈ మహమ్మారికి విరుగుడు కనుగొనే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ను తయారు చేసినట్లు అధికారికంగా ప్రకటించగా త్వరలోనే భారత్లో కూడా వ్యాక్సిన్ రానుంది. ఇక చైనాలో పుట్టిన ఈ మహమ్మారిని అంతమొందించే క్రమంలో ఆ దేశం కూడా ఓ కొత్త వ్యాక్సిన్ను తీసుకొచ్చింది. ఈ వ్యాక్సిన్ను చైనా నేషనల్ ఫార్మాష్యూటికల్స్ గ్రూప్ సైనోఫార్మ్ తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ సురక్షితమని పేర్కొంది.
Recommended Video
వ్యాక్సిన్ తయారు చేసిన సైనో ఫార్మ్
చైనాలో పుట్టిన కరోనావైరస్ మహమ్మారి ఆ తర్వాత ఇతరదేశాలకు పాకి దేశ ప్రజలను ఆర్థికవ్యవస్థలను కుదేలు చేసింది. ఇప్పుడు ఆ మహమ్మారిని అంతమొందించేందుకు చాలా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా చైనా కూడా ఓ వ్యాక్సిన్ను కనుగొనింది. చైనా తయారు చేసిన వ్యాక్సిన్ సురక్షితమని ప్రకటించింది. ట్రయల్స్ సందర్భంగా ఇది రోగనిరోధక శక్తిని పెంచుతోందని తమ పరిశోధనల ద్వారా వెల్లడైనట్లు సైనో ఫార్మ్ పేర్కొంది. వ్యాక్సిన్ను ఒక వాలంటీర్పై ప్రయోగించగా అతనిలో రోగనిరోధక శక్తి పెంపొందిందని పరిశోధకులు తెలిపారు.ఇక కొన్ని వేల మందిపై ఈ వ్యాక్సిన్ను ప్రయోగించేందుకు సైనో ఫార్మ్ రంగం సిద్ధం చేస్తోంది.
యూఏఈలో 15వేల మంది వాలంటీర్ల నియామకం
సైనోఫార్మ్ యూఏఈలో మూడవ దశ ట్రయల్స్ నిర్వహించేందుకు దాదాపు 15వేల మంది వాలంటీర్లను నియమించుకోనుంది. అంతేకాదు చైనా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సైనో ఫార్మ సంస్థ తయారు చేసిన ఈ వ్యాక్సిన్ను తమ మిత్రదేశమైన పాకిస్తాన్కు కూడా పంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ అనే పత్రిక ప్రధానంగా ప్రచురించింది. ఇదిలా ఉంటే చైనా తయారు చేసిన వ్యాక్సిన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూపలేదని జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ తన పేపర్లో పబ్లిష్ చేసింది.
యాంటీబాడీస్ రోగనిరోధక శక్తి
ఇక వ్యాక్సిన్ రెండు దశల్లో ఆరోగ్యంగా ఉన్న 320 మంది యువతపై ప్రయోగించడం జరిగిందని వాటి ఫలితాలనే ప్రచురించడం జరిగిందని చైనా పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీస్ పెరిగాయని చెప్పిన పరిశోధకులు కోవిడ్-19 ఇన్ఫెక్షన్ను ఇది ఏమేరకు ప్రతిఘటిస్తుందనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉంటే సైనో ఫార్మ్ సంస్థ ఛైర్మెన్ మాత్రం ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ను తీసుకొస్తామని చెప్పారు. మరో మూడు నెలల్లో మూడవ దశ ట్రయల్స్ పూర్తి చేసి వ్యాక్సిన్ను విజయవంతంగా తీసుకొస్తామని చెప్పారు.
ఇప్పటికే కరోనావైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 7,50,000 మంది మృతి చెందారు. దీంతో వ్యాక్సిన్ వెంటనే తీసుకువచ్చి ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయాలనే తపనతో ప్రపంచ అగ్రదేశాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే పోటీపడి వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయి. ఇప్పటికే 150 వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా టెస్టింగ్ దశలో ఉన్నాయి. చైనా మొత్తం 8 వ్యాక్సిన్లను డెవలప్ చేసింది. ఇవన్నీ వివిధ టెస్టింగ్ దశల్లో ఉన్నాయి.